SRIMADRAMAYANA ( Sundarakanda )by Chaganti Koteswara Rao Garu S7

SRIMADRAMAYANA PRAVACHANAMRUTHADHARA -- 7 BY PUJYAGURUVULU Brahmasri Chaganti Koteswara Rao Garu

హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకొని ఉత్తరదిక్కుకి వచ్చి " లంకా పట్టణమునకు రావడము సీతమ్మ తల్లి దర్శనము చెయ్యడము అయిపోయింది. ఆ రావణుడికి ఒక మాట చెపితే ఏమన్నా ప్రయోజనము ఉంటుందేమో దర్శనం ఇవ్వమని అడిగితే వాడు ఎలాగు ఇవ్వడు. అందుకని వీడికి అత్యంత ప్రియమైన ఈ ప్రమదావనమును (అశోక వనం) నాశనం చేస్తే వాడే నన్ను పిలుస్తాడు " అని అనుకొని భీమరూపుడై అశోకవనం మీద ఎగిరాడు. ఆయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు విరిగిపోయాయి. హనుమ చేసిన మహా నాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కిందపడిపోయాయి. అక్కడున్న సరోవరములలోని నీళ్ళని బయటకి తోసేశాడు.

హనుమ చేస్తున్న విధ్వంసమునకు అక్కడున్న రాక్షసులు ఉలిక్కిపడి లేచారు.

రాక్షసస్త్రీలు సీతమ్మ దగ్గరికి వచ్చి " ఈ కోతి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టుమీద కూర్చుని ఉండడము చూశాము. నీ దగ్గరికి వచ్చి కిచకిచలాడినట్టు మాకు అనుమానం. ఆ కోతి ఎవరు? " అని అడిగారు.
సీతమ్మ " పాము కాళ్ళు పాముకి తెలియాలి. ఆయన రాక్షసుడో వేరొకడో తెలుసుకునే శక్తి నాకెక్కడ ఉన్నది. ఆయనెవరో మీకే తెలియాలి, నాకు తెలియదు " అన్నది.

రాక్షసస్త్రీలు పరుగు పరుగున రావణుడి దగ్గరికి వెళ్ళి " ఎక్కడనుంచి వచ్చిందో కాని మహా వానరము ఒకటి వచ్చింది. అది ఇంద్రుడి దూతో, కుబేరుడి దూతో, విష్ణువు దూతో, యముడి దూతో మాకు తెలియదు. అది అశోకవనమంతటినీ నాశనము చేసింది. సీత కూర్చున్న శింశుపావృక్షాన్ని మాత్రము అది వదిలిపెట్టేసింది. అలసట చేత వదిలిపెట్టిందో కావాలని వదిలిపెట్టిందో తెలీదు. అలసటని అనుకోడానికి వీలులేదు. ఇంత అశోకవనాన్ని నాశనము చేసిన వానరానికి శింశుపావృక్షము నాశనం చెయ్యడం పెద్ద లెక్కకాదు. అది కావాలనే వదిలిపెట్టింది. ఏ కాంత మీద అయితే నీ మనస్సుని కామమును ఉంచావో ఆ సీతతో ఈ వానరము మాట్లాడింది " అని చెప్పారు.

రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చి ఎనభైవేల రాక్షసకింకరులని పిలిచి " మీరందరూ వెళ్ళి ఆ మహావానరమును పట్టి బంధించండి లేకపోతే సంహరించండి " అని చెప్పి పంపించాడు.

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||
దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||
అర్ధయిత్వా పురీం లంకామ్ అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్థోగమిష్యామి మిషతామ్ సర్వరక్షసామ్||
(ఈ శ్లోకములను జయమంత్రము అంటారు)

ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చుని ఈ జయ మంత్ర శ్లోకములను చెప్పాడు " రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ. నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను, ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తోక్కేస్తాను. నా పిడి గుద్దులతో చంపేస్తాను. పెద్ద పెద్ద చెట్లతో, రాళ్ళతో కొడతాను. వెయ్యిమంది రావణాసురులు నా భుజములకింద ఒక కీటకముతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకాపట్టణములో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగే మొనగాడు ఈ లంకా పట్టణములో లేడు " అని జయ మంత్రాన్ని చెప్పాడు.
ఎనభైవేల రాక్షసకింకరుల మూక హనుమంతుడి మీదకి రకరకములైన ఆయుధములను వేశారు. చండ ప్రచండుడైన హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిఘని ఒకదాన్ని పీకి దానితో వాళ్ళందరినీ కొట్టాడు. కళ్ళు మూసి తెరిసేలోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలు రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయింది. మళ్ళీ ఆయన తోరణం ఎక్కి కూర్చున్నాడు, ఆయనకి దూరంగా వెయ్ములతో ఉన్న ఒక ప్రాసాదం కనపడింది. ఆ ప్రాసాదం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదము చేశాడు. అది వినేసరికి లంకా పట్టణములో కొన్ని వేలమంది గుండెలు బద్దలయ్యి, చెవుల వెంట, ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారు. ఆయన తొడలు కొడితే ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు. ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభమును పీకి గాలిలో గిరగిర తిప్పితే ఆ వేగానికి అందులోనుంచి అగ్ని పుట్టి ఆ ప్రాసాదం అంతా కాలిపోయింది. ఆ ప్రాసాదానికి కాపలా ఉన్న నూరు మంది రాక్షసులని కూడా కొట్టి చంపేశాడు.
" మా వానరములలో పది ఏనుగుల బలం కలిగినవారు, వంద ఏనుగుల బలం కలిగినవారు, వెయ్యి ఏనుగుల బలం కలిగినవారు, పదివేల ఏనుగుల బలం కలిగినవారు, అంతకన్నా ఎక్కువ బలం కలిగిన వారు ఉన్నారు. భూమికి అడ్డంగా ఎగరగలిగేవాళ్ళు, నిలువుగా ఎగరగలిగేవాళ్ళు ఈ భూమండలం అంతటా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు. వాళ్ళెవరూ మిమ్మల్ని విడిచిపెట్టరు. సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగుపెట్టిననాడు ఈ లంక, మీరు, ఆ రావణుడు ఎవరూ లేరు. ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారు " అని చెప్పి తోరణం మీదకి వచ్చి జయ మంత్రం చెప్పాడు.

ఎనభైవేలమంది చనిపోయారన్న విషయం తెలుసుకున్న రావణుడు ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని పంపాడు. గాడిదలు పూన్చిన రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. హనుమంతుడు ఆ జంబుమాలి మీదకి ఒక పెద్ద రాయిని విసిరాడు. బాణములతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు చేశాడు. హనుమంతుడు ఒక సాల వృక్షాన్ని పీకి విసిరాడు. ఆ చెట్టు మీద పడకముందే దానిని జంబుమాలి ఖండ ఖండములుగా కొట్టాడు. ఆ జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద, వక్షస్థలం మీద బాణములతో కొట్టాడు. ఆ దెబ్బలకి ఆయన శరీరం నుండి రక్తం కారింది. హనుమంతుడు మళ్ళీ ఒక పరిఘని పీకి గిరగిర తిప్పుతూ పిడుగు వచ్చి పడినట్టు ఆకాశములోకి ఎగిరి వాడిమీద పడి ఆ పరిఘతో కొట్టాడు. ఆ దెబ్బకి జంబుమాలి రథం, శిరస్సు, చేతులు, గాడిదలు మొదలైనవి ఏమి కనపడలేదు. మళ్ళీ ఆయన తోరణం ఎక్కి జయ మంత్రం చెప్పడము ప్రారంభించాడు. అక్కడున్న రాక్షసులందరినీ కాళ్ళ కింద పెట్టి తొక్కి మోకాళ్ళతో కుమ్మి, చేతులతో అక్కడున్న రాక్షసులందరినీ సంహరించాడు.
" జంబుమాలి వెనక వెళ్ళిన సైన్యము అంతా మరణించారు " అని రావణుడికి కబురు వెళ్ళింది. అప్పుడు రావణుడు తన ఏడుగురు మంత్రులని హనుమ పైకి యుద్ధానికి పంపించాడు. వాళ్ళు అన్ని వైపులనుండి హనుమ మీదకి బాణ ప్రయోగము చేశారు. హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా పెంచేసి ఆకాశములోకి ఎగిరి ఒక్కసారి కింద పడిపోయాడు. ఆయన కింద పడిపోయి చాలామంది చనిపోయారు. మిగిలినవారి గుండెల్ని తన గోళ్ళతో గిల్లేసి చంపేశాడు. కొంతమందిని పళ్ళతో కొరికి చంపేశాడు. అప్పుడా ప్రాంతం తెగిపోయిన తలలతో, చచ్చిపోయిన ఏనుగులతో, పచ్చడైపోయిన శరీరములతో, విరిగిపోయిన రథములతో ఉన్నది.

వెళ్ళిన మంత్రులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది. అప్పుడాయన ఐదుగురు సేనాగ్ర నాయకులని పిలిచి " మీరు ఆ వానరమును జాగ్రత్తగా పట్టండి. అది సామాన్యమైన వానరము కాదు. నేను ఎందరో మహర్షులను బాధ పెట్టాను. వాళ్ళందరూ తమ తపోశక్తులని ధారపోసి సృష్టించిన మహాభూతం అయి ఉంటుంది " అన్నాడు. విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘస, భాసకర్ణ అనే ఐదుగురు సేనా నాయకులు వెళ్ళి హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు. వాళ్ళల్లో దుర్ధరుడు వేసిన మూడు ఇనుప బాణములు హనుమంతుడి తలలో తగిలాయి. ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు. ఆకాశములోకి హనుమంతుడు ఎగిరాడని ఆ సేనా నాయకులు అలా చూశారు అంతే ఆయన  ఆ దుర్ధరుడి రథం మీద పడిపోయాడు. హనుమంతుడి శరీరం కింద దుర్ధరుడు, ఆయన రథం, అన్నీ పచ్చడయి పోయి ఉన్నాయి. మిగిలిన వారిలో ఇద్దరు ఆయన వైపు పరుగులు తీసారు. హనుమంతుడు ఒక పెద్ద చెట్టుని పెకలించి దానితో ఆ ఇద్దరినీ కొట్టాడు. ఆ దెబ్బకి ఆ ఇద్దరూ మరణించారు. మిగిలిన ఇద్దరినీ సంహరించాడు.

ఈ వార్త విన్న రావణుడు సభలో అటూ ఇటూ తేరిపారి చూసి తన చిన్న కుమారుడైన అక్ష కుమారుడి మీద ఆయన చూపులు ఆగాయి. తండ్రి తన వంక చూడగానే  అక్షకుమారుడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా పైకి లేచి సంతోషముగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే ' ఈ పిల్లవాడు ఎంతో బావున్నాడు. చిన్నవాడే కాని చూస్తుంటే అగ్నిహోత్రములా ఉన్నాడు. కాసేపు వీడిని యుద్ధం చెయ్యనిద్దాము ' అని హనుమంతుడు అనుకున్నాడు. అక్ష కుమారుడు వేసిన బాణ పరంపర నుండి హనుమంతుడు సూక్ష్మరూపములో దొరకకుండా తిరుగుతున్నాడు. అక్ష కుమారుడు హనుమంతుడి శరీరములో ఖాళీ లేకుండా బాణములతో కొట్టేశాడు. అప్పుడు హనుమంతుడు ' దేవతలు కూడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషిస్తారు,  ఇంట్లో అగ్ని ఉందని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది. ఇక వీడిని చంపవలసిందే ' అనుకొని, ఆకాశంములోకి ఎగిరి శరీరమును పెద్ది చేసి కింద పడ్డాడు. గుర్రాలు, రథం, సారధి చనిపోయారు కాని అక్షకుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళి ఆకాశము నుండి యుద్ధం చేశాడు. హనుమంతుడు గాలిలోకి ఎగిరి అక్షకుమారుడి పాదములను పట్టుకొని వేగంగా కిందకి లాగి నేలకేసి బాదాడు. ఆ దెబ్బకి అక్షకుమారుడి కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయి, తలకాయి వెయ్యి ముక్కలయి కడుపు బద్దలయిపోయి పేగులు బయటకి వచ్చాయి.

తన చిన్న కుమారుడు మరణించాడన్న వార్త విన్న రావణుడికి జీవితములో మొదటిసారి బాధ, భయం అంటే ఏమిటో తెలిసి వచ్చింది. అప్పుడాయనకి ఎవరిని పంపాలో అర్ధం కాక ఇంద్రజిత్ వంక చూసి " నిన్ను పంపకూడదు కాని ఇవ్వాళ నిన్ను పంపక తప్పడము లేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళు, లంకాపట్టణ భద్రత అంతా నీ చేతులలో ఉన్నది. ఒకసారి అస్త్రాలన్నిటిని మననము చేసుకుంటూ వెళ్ళు. ఎలాగైనాసరే ఆ వానర వీరుడి వేగం తగ్గించి పట్టుకో. అవకాశం దొరికితే వాడిని సంహరించు " అని చెప్పి పంపాడు. ఇంద్రజిత్ రావణుడికి ప్రదక్షిణము చేసి బయలుదేరాడు.

ఇంద్రజిత్, హనుమంతుడు ఒకరికి ఒకరు దొరకకుండా యుద్ధం చేసుకుంటున్నారు. ముందు ఈ వానరము యొక్క వేగము తగ్గించాలి అనుకొని ఇంద్రజిత్ హనుమ మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలో హనుమంతుడికి పూర్వం బ్రహ్మగారు ఇచ్చిన వరం( ఏ అస్త్రము నిన్ను ఏమి చెయ్యలేదు) జ్ఞాపకము వచ్చి ' ఇది బ్రహ్మాస్త్రం అనగా బ్రహ్మగారి పేరు మీద ఉన్న అస్త్రం నేను దీనిని గౌరవించాలి. నేను ఆయనని తలుచుకొని నమస్కరించగానే ఇది నన్ను వదిలేస్తుంది కానీ నేను దీనికి కొంతసేపు కట్టుబడి ఉంటాను ' అనుకున్నాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడడము వలన హనుమంతుడు నేలమీద పడిపోయాడు. ఈలోగా అక్కడున్న రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి కనపడ్డ గుడ్డ ముక్కలతో హనుమంతుడి కాళ్ళు, చేతులు కట్టేసి, కర్రలతో కొట్టారు. హనుమంతుడు ' ఇలా ఈ రాక్షసులని ఎంతసేపు చంపుతాను? ఒకసారి రావణుడిని చూస్తాను ' అనుకొని అలా ఉండిపోయాడు.

  ఇంద్రజిత్ అనుకున్నాడు ' ఈ రాక్షసులు బుద్ధిహీనులు. నేను బ్రహ్మాస్త్రముతో కడితే వీళ్ళు వెళ్ళి తాళ్ళతో కట్టారు. బ్రహ్మాస్త్రము చేత నిర్భంధింపబడ్డ వ్యక్తిని వేరొకదానితో కడితే ఆ బ్రహ్మాస్త్రము వదిలేస్తుంది. ఒకసారి బ్రహ్మాస్త్రము వెయ్యబడ్డ వ్యక్తి మీద ధనుర్వేదములో ఉన్న ఏ అస్త్రం మళ్ళీ సూర్యోదయము అయ్యేవరకు పనిచెయ్యదు. ఇప్పుడీయన తలచుకుంటే ఏమన్నా చెయ్యగలడు. కాని ఆ వానరానికి అస్త్రము వదిలేసిందన్న విషయము తెలియ లేదు, వీళ్ళు కట్టేయడం వలన ఇంకా ఆ బ్రహ్మాస్త్రమే పట్టుకుని ఉందనుకుంటున్నాడు " అని అనుకొని సంతోషపడ్డాడు.

వాళ్ళు హనుమంతుడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి రావణుడి దగ్గర నిలబెట్టారు. ఒక నల్లని మబ్బుని కాని, ఒక కాటుక కొండని కాని తీసుకొచ్చి సింహాసనము మీద పెట్టినట్టుగా  రావణుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. రత్నములు, వజ్రములు, స్ఫటికములు తాపడము చెయ్యబడ్డ ఒక పెద్ద ఉత్తమమైన వేదిక మీద కూర్చుని ఉన్నాడు. రావణుడికి వానరమైన హనుమంతుడితో మాట్లాడడము సిగ్గుగా అనిపించి తన మంత్రైన ప్రహస్తుడి వంక చూసి " ఎక్కడినుంచి వచ్చాడు? ఎందుకొచ్చాడు? ఎవరివాడు? నాకు ఇష్టమైన అశోక వనాన్ని ఎందుకు నాశనం చేశాడు? సీతతో ఎందుకు మాట్లాడాడు? ఏమి మాట్లాడాడు? ఈ విషయాలు మీరు ఆ వానరాన్ని అడిగి కనుక్కోండి. నిజం చెబితే వాడి ప్రాణాలు ఉంటాయి, అబద్ధం చెబితే ప్రాణాలు పోతాయి " అన్నాడు.

  ప్రహస్తుడు లేచి " నువ్వేమి భయపడకు. మా ప్రభువు ధర్మాత్ముడు. నిజం చెపితే నిన్ను పంపించి వేస్తాము. నిన్ను అగ్ని పంపించాడా ? యముడు పంపించాడా ? కుబేరుడు పంపించాడా ? విష్ణువు పంపించాడా ? ఎవరి ప్రమేయం వల్ల నువ్వు ఈ లంకాపట్టణమునకు  వచ్చావు? ఎందుకు అశోక వనాన్ని నాశనము చేశావు? " అని ప్రశ్నించాడు.
  హనుమ రావణుడి వంక చూసి " ఏమి కాంతి! ఏమి ద్యుతి! ఏమి పరాక్రమం! నిజంగా వీడి దగ్గరే కాని మహా పతివ్రతయిన స్త్రీని అపహరించి తెచ్చిన పాతకము లేకపోతే వీడు మూడు లోకములను శాసించగలిగినవాడు కదా! " అన్నాడు.

హనుమని చూసిన రావణుడు భయపడి ' ఇది ఒక వానరుడికి ఉండవలసిన తేజస్సు కాదు. ఇంతకముందు నేను జాంబవంతుడిని, వాలిని, సుగ్రీవుడిని, సుషేణుడిని, నీలుడిని చూశాను.   వాళ్ళెవరికీ ఇంత పరాక్రమము, సామర్థ్యము లేవు. బహుశా ఆనాడు నేను కైలాస పర్వతములను కదిపేస్తున్నప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు, ' వానరులు నా కొంప ముంచుతాయని '. బహుశా నందీశ్వరుడే వచ్చాడేమో ' అనుకొన్నాడు.
  హనుమంతుడు అన్నాడు " నేను రామదూతగా ఇక్కడికి వచ్చాను. వానరస్వరూపమే నా యథార్ధ స్వరూపము. నన్ను హనుమ అంటారు. సుగ్రీవుడి సచివుడిని. కిష్కిందా రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా! ఆ వాలిని ఒక బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకము చేసాడు. నీకు వాలికి ఉన్న స్నేహబంధం వల్ల సుగ్రీవుడు నీకు సోదరుడి వరస అవుతాడు. ఆ సుగ్రీవుడు నీ కుశలము అడిగానని చెప్పమన్నాడు. నేను రాక్షసుడిని కాదు. రాముడిలా నరుడిని కాదు. నేను తటస్థమైనవాడిని వానరుడిని. అందుకని నీ మంచి కోరి నాలుగు మంచి మాటలు చెబుతాను. వింటే బాగుపడతావు లేకపోతే నాశనమయిపోతావు. నిన్ను చూడడానికి వేరొక ఉపాయము లేదు. దండోపాయంతో అశోకవనము నాశనం చేశాను.   నీ వాళ్ళు నా మీదకి యుద్ధానికి వచ్చారు. దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి నాలుగు గుద్దులు గుద్దాను వాళ్ళు చనిపోయారు.

పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన నలుగురు కుమారులలో పెద్దవాడైన రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసమని పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడము కోసం లక్ష్మణుడు, సీతమ్మతో కలిసి దండకారణ్యమునకు వచ్చాడు. రాముడి భార్య అయిన సీతమ్మని నువ్వు అపహరించి తెచ్చి లంకలో పెట్టావు. సీతమ్మ ఎవరో నాకు తెలీదు నేను చూడలేదని అబద్ధాలు చెప్పవద్దు. నేను సీతమ్మని అశోకవనములో చూసాను. నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు. సీతమ్మ అయిదు తలల పాము నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు. రాముడి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నిన్ను చంపడానికి రాముడి దాకా ఎందుకు? సుగ్రీవుడు నిన్ను చంపేస్తాడు. రాముడికి సుగ్రీవుడికి అగ్ని సాక్షిగా స్నేహం ఉన్నది. రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువే. నువ్వు ఆనాడు ' నర వానరములతో తప్ప ' అని బ్రహ్మగారిని వరం అడిగావు కదా! సుగ్రీవుడు గంధర్వుడు, కిన్నెరుడు, యక్షుడు, దేవత, రాక్షసుడు కాదు. ఆయన కేవలము వానరుడు. మనం చేసిన పుణ్యపాపాలకి సంబంధించిన ఫలితాలని పరమాత్మ ఏకకాలములో ఇస్తాడు. నువ్వు చేసిన పుణ్యాలకి కాంచనలంకని పొందావు. వేలమంది కాంతలతో సుఖాలని అనుభవించావు. ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు. కాని నువ్వు ఇవ్వాళ పరాయి స్త్రీని అపహరించి తీసుకొని వచ్చిన పాపం వల్ల నువ్వు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నావు. రాముడికి ధనుర్వేదంలో సమస్త అస్త్ర శస్త్రములు తెలుసు. ఋషుల దగ్గర శిక్షణ పొందిన మహాధర్మాత్ముడు. రాముడు లంకలో నిలబడి కోదండము పట్టుకొని బాణములు విడిచిపెడితే నువ్వు నిలబడలేవు. ఆ సమయంలో నీలాంటి రావణులు లక్షమంది వచ్చినా రాముడిముందు నిలబడలేరు.
ఒకనాడు నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తబోతుంటే శివుడు తన కాలి బొటను వేలితో ఆ పర్వతాన్ని తొక్కగా నీ ఇరవై చేతులు ఆ పర్వతం కింద ఉండిపోయాయి. అటువంటి శివుడి ధనుస్సుని రాముడు హేలగా విరిచేశాడు. నిన్ను ముప్పతిప్పలు పెట్టిన వాలిని రాముడు ఒక్క బాణముతో కొట్టాడు. ఈ ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరినీ ఓడించిన పరశురాముడికి గర్వభంగం చేశాడు. పదునాలుగువేలమంది రాక్షసులని జనస్థానంలో రాముడొక్కడే సంహరించాడు. అటువంటి రాముడు వస్తే నువ్వు బ్రతకగలవా! అయినా నిన్ను చంపడానికి రాముడు ఎందుకు? నేను చాలు. మర్యాదగా సీతమ్మని రాముడికి అప్పగిస్తే బ్రతికిపోతావు, లేదా చచ్చిపోతావు " అన్నాడు.
నిండుసభలో తనని హనుమంతుడు ఇంతలా అపేక్షించి మాట్లాడేసరికి రావణుడికి ఆగ్రహము వచ్చి " ఈ వానరాన్ని చంపెయ్యండి " అన్నాడు.
  విభీషణుడు లేచి " అన్నయ్యా! నువ్వు వేదాలు చదువుకున్నావు. ధర్మములు తెలుసుకున్నావు. ఇలా దూతని చంపమని నువ్వు అనడము సరికాదు. దూతకి తల గొరిగించవచ్చు, అవయవాన్ని తీసెయ్యవచ్చు, వాత పెట్టవచ్చు అనేటటువంటి శిక్షలు కొన్ని శాస్త్రములో ఉన్నాయి. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతలివారికి ఎలా తెలుస్తుంది? అందుకని వచ్చిన దూతని చంపవద్దు " అన్నాడు.

విభీషణుడి మాటలు విన్న రావణుడు " వానరములకు తమ తోక అంటే చాలా ఇష్టం.  వీడి తోకకి నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరము తనని పంపినవారి దగ్గరికి వెళుతుంది. ఈ వానరము యొక్క మిత్రులు, బంధువులు చుట్టూ చేరి ' తోకలేని కోతి, తోకలేని కోతి ' అని ఏడిపిస్తారు " అన్నాడు.

  వాళ్ళు పాత బట్టలు పట్టుకొచ్చి హనుమ తోకకి చుట్టి నెయ్యి పోసి మంట వెలిగించారు. హనుమంతుడిని కట్టి రథం ఎక్కించి నాలుగుకూడళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి కర్రలతో కొడుతూ ' గూఢచారి, గూఢచారి ' అని ప్రకటించారు. లంకాపట్టణములో అందరు మేడల మీద మిద్దెల మీద నిలబడి చూస్తున్నారు.

  హనుమంతుడు ' వీళ్ళు నన్ను కొడితే కొట్టారులే కాని, రాత్రి వేళ ఈ లంకాపట్టణమును  అన్వేషించాను. ఒకసారి పగటిపూట ఈ రావణుడి బలం ఏమిటో! లంక యొక్క గొప్పతనం ఏమిటో! చూసి సుగ్రీవుడికి చెబుతాను ' అనుకున్నాడు. వాళ్ళు హనుమని ఆ లంకా పట్టణము అంతా తిప్పాక ఆయన ఒక్కసారి కట్లని విడిపించుకొని ఎగిరి రాజద్వారం మీదకి దూకి తన చేతితో మండుతున్న తోకని పట్టుకున్నాడు.

  కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళి " నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి తోకకి రావణుడు నిప్పు పెట్టించాడు " అన్నారు.

సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్ధన చేసి " నేను సర్వకాలములయందు రాముడికే సేవ చేసిన దాననయితే, రాముడినే మనసులో పెట్టుకున్న దాననయితే, నాకు భాగ్యవిశేషం మిగిలి ఉంటే, రాముడికి నామీద ప్రేమ ఉంటే, సుగ్రీవుడు నన్ను తీసుకెళ్ళి రాముడితో కలపడం యథార్ధమయితే, హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్ని చల్లబడుగాక " అన్నది.
వెంటనే హనుమ తోకకి ఉన్న అగ్ని వెన్నముద్దలా చల్లగా అయిపోయింది. అప్పుడాయన అనుకున్నాడు ' అవునులే నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిథ్యము ఇచ్చాడు. సముద్రుడు నమస్కారం చేశాడు. రాముడి పేరు, సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించనిది ఏముంటుంది? నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు ' అని అనుకుని, ' ఈ లంకా పట్టణమును  కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను ' అనుకొని, మొదట ప్రహస్తుడి ఇంట్లో నిప్పు పెట్టాడు. అన్ని ఇళ్ళ మీదకి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలము కడుపుమండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశము దొరికిందని ఆనందపడ్డారు. హనుమ అలా నిప్పుపెట్టగానే అగ్నిదేవుడు కాల్చేస్తున్నాడు, వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ళమీద వేసేశాడు. కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల ఎర్రగా ఆ లంక అంతా కాలిపోతున్నది. ఆ లంకలో అందరూ " హా తాత! హా పుత్ర! హా తల్లి! " అని అరుచుకుంటూ దిక్కులుపట్టి పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు సంతోషముగా వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద నిలబడి చూసేసరికి ఎదురుగా లంక లంకంతా కాలిపోతూ కనిపించింది.

 ఆయన " అరే ఎంతపని చేశాను ! అగ్నిని తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేసినట్టు కోపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు. పాము కుబుసాన్ని విడిచినట్టు కోపాన్ని విడిచిపెట్టడము  మానేసి లంకని కాల్చేశాను. ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. ఏ సీతమ్మ తేజస్సు చేత నా తోకని అగ్ని కాల్చలేదో, అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుందా! సీతమ్మే అగ్ని. అగ్నిని అగ్ని కాలుస్తుందా " అని అనుకున్నాడు.

ఇంతలో అటుగా వెళుతున్న చారిణులు (భూమికి దగ్గరగా ఆకాశములో ఎగురుతూ శుభవార్తలు చెప్పే దేవ గాయకులు) " ఏమి ఆశ్చర్యము ! ఇవ్వాళ ఒక వానరుడైన హనుమ నూరుయోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణమును అగ్నికి ఆహుతి చేశాడు. ఆ లంక అంతా కాలిపోతున్నది కాని శింశుపావృక్షము, ఆ వృక్షము క్రింద కూర్చున్న సీతమ్మకి ఎటువంటి అపకారము జరగలేదు. అలాగే విభీషణుడి ఇంటికి కూడా ఏమి జరగలేదు " అన్నారు.

 హనుమంతుడు శింశుపా వృక్షం క్రింద  కూర్చున్న సీతమ్మ దగ్గరికి వచ్చి " అమ్మా! లంకంతా కాల్చేశాను. రావణుడికి చెప్పవలసిన మాట చెప్పేశాను. నువ్వేమి బెంగపెట్టుకోకు. వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు. రాముడి కోసం వాడిని వదిలేశాను. లేకపోతే  వాడి పది తలకాయలు గిల్లేసేవాడిని. అమ్మా! నేను బయలుదేరతాను. తొందరలోనే నీకు పట్టాభిషేకము జరుగుతుంది శోకమునకు గురికావద్దు" అని సీతమ్మతో చెప్పి ఒక్క దూకు దూకి ఆకాశములోకి ఎగిరి నల్లటి వనములతో, ఎర్రటి మచ్చలు కలిగిన ఏనుగులతో ఉన్న   అరిష్టమనే పర్వతం మీద దిగి అక్కడినుంచి బయలుదేరాడు. హనుమ ఆ పర్వతం మీద నుంచి ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుకుపోయింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.