SRIMADRAMAYANA ( Sundarakanda )by Chaganti Koteswara Rao Garu S6

SRIMADRAMAYANA PRAVACHANAMRUTHADHARA -- 6 BY PUJYAGURUVULU Brahmasri Chaganti Koteswara Rao Garu

తనకి కలలో వానరము కనపడిందనుకొని సీతమ్మ భయపడి( స్వప్నంలో వానరము కనపడితే కీడు జరుగుతుందని అంటారు) " లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళము కలగాలి, నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి " అని అన్నాక సీతమ్మ అనుకుంటుంది ' అసలు నాకు నిద్ర వస్తే కదా! కల రావడానికి నేను అసలు నిద్రేపోలేదు. ఇదంతా నేను నిరంతరం రాముడిని తలుచుకుంటూ ఉండడము వలన రామకథని విన్నానన్న భ్రాంతికి లోనయ్యాను ' అనుకుని మళ్ళీ పైకి చూసింది. చూసేసరికి హనుమంతుడు అక్కడే ఉన్నాడు.

సీతమ్మ " ఇంద్రుడితో కూడుకుని ఉన్న బృహస్పతికి నమస్కారము. అగ్నిదేవుడికి నమస్కారము. బ్రహ్మగారికి నమస్కారము. ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యమగుగాక " అని దేవతలని ప్రార్ధన చేసింది.
హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మల కిందకి వచ్చి " అమ్మా! నేను అబద్ధము చెప్పలేదు. నేను యథార్థము చెప్పాను. నేను రామదూతని. సుగ్రీవుడి సచివుడిని నన్ను నమ్ము " అన్నాడు.

సీతమ్మ" ఎవడు నూరు సంవత్సరముల జీవితాన్ని పండించుకుంటాడో, ఉత్సాహముతో నిలబడతాడో, వాడు ఏదో ఒకనాటికి జీవితములో శుభవార్త వింటాడు. నేను బహుశా ప్రాణములు విడిచిపెట్టకుండా నిలబడినందుకు ఈ శుభవార్త విన్నాను " అన్నది.

హనుమంతుడు " అమ్మా! నువ్వు దేవతలకి చెందినదానివా? యక్షులకు చెందినదానివా? గంధర్వులకు చెందినదానివా? కిన్నెరులకు చెందినదానివా? వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన అరుంధతివా? అగస్త్యుడి మీద అలిగి వచ్చిన లోపాముద్రవా? నీ పాదములు భూమి మీద ఆనుతున్నాయి. నువ్వు దేవతా స్త్రీవి కావు. నీలో రాజలక్షణాలు కనపడుతున్నాయి కనుక నువ్వు ఖచ్చితముగా క్షత్రియ వంశానికి సంబంధించిన ఒక రాజు ఇల్లాలివి అయి ఉంటావు అని నేను అనుకుంటున్నాను. నువ్వు కాని జనస్థానములో రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మవి కాదు కదా? " అన్నాడు.
సీతమ్మ " ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన రాజులలో చాలా గొప్పవాడైన, శత్రుసైన్యాలని చీల్చి చెండాడగల దశరథ మహారాజు పెద్ద కోడలని నేను. విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజుకి కూతురిని నన్ను సీత అంటారు. బుద్ధిమంతుడైన రాముడికి ఇల్లాలిని. నేను అయోధ్యలో పన్నెండు సంవత్సరములు హాయిగా గడిపాను. కాని పదమూడవ సంవత్సరములో దశరథుడి ఆజ్ఞమేరకు దండకారణ్యమునకు వచ్చాము. రాముడు లేనప్పుడు రావణుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకొచ్చాడు " అన్నది.

' సీతమ్మకి నా మీద నమ్మకము కలిగింది ' అని హనుమంతుడు అనుకొని ఆమె దగ్గరికి గబగబా వెళ్ళాడు. అలా వస్తున్న హనుమని చూసి సీతమ్మ మళ్ళీ మూర్చపోయింది. కొంతసేపటికి తేరుకొని " నువ్వు దుర్మార్గుడవైన రావణుడివి రూపము మార్చుకొని వచ్చావు " అన్నది.

సీతమ్మ మనస్సులో ' ఈ వానరాన్ని చూస్తే అలా అనిపించడం లేదు. మనస్సులోనుంచి ప్రీతి పొంగుతుంది. ఈయన అటువంటివాడు కాదనిపిస్తుంది. ఈయనని చూస్తే పుత్ర వాత్సల్యము కలుగుతున్నది ' అని అనుకొని, " నాయనా! నువ్వు ఎవరివో యథార్ధముగా నాకు చెప్పు " అన్నది.
హనుమంతుడు " అమ్మా! నువ్వు అపహరించబడ్డాక రాముడు జటాయువుతో మాట్లాడాడు. తరువాత జటాయువు ప్రాణములు వదిలాడు. తరువాత కబంధుడు కనబడ్డాడు. ఆ తరువాత సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు. సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలి సంహారము చేసిన తరువాత సుగ్రీవుడికి పట్టాభిషేకము చేసారు. నిన్ను వెతకడము కోసం సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయాక వానరములను పంపించాడు. దక్షిణదిక్కుకి అంగదుడి నాయకత్వములో వచ్చిన వానరములు సముద్రాన్ని చేరుకొని ఉండిపోయాయి. నన్ను హనుమ అంటారు. కేసరి నా తండ్రి, మా తల్లి అంజనాదేవి క్షేత్రముగా వాయుదేవుడికి ఔరసపుత్రుడిని. నేను నీ కుమారుడివంటి వాడను రామదూతని. రాముడు నీకోసం బెంగపెట్టుకుని ఉన్నాడు. నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. నన్ను నమ్ము తల్లీ " అన్నాడు.

సీతమ్మ" నువ్వు వానరుడివి, రాముడు నరుడు. నరవానరములకి స్నేహం ఎలా కుదిరింది? నా శోకము పోవాలంటే నేను రాముడి గుణములు వినాలి. నువ్వు అంత రామ భక్తుడివి అయితే రాముడు ఎలా ఉంటాడో చెప్పు? " అన్నది.

రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షితా|
రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః ||

హనుమంతుడు " రాముడంటే మూర్తీభవించిన ధర్మం. తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు.

రామః కమల పత్రాక్షః సర్వసత్త్వ మనోహరః |
రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే ||

రాముడు పద్మముల వంటి కన్నులున్నవాడు. అన్ని ప్రాణులు ఆయనని చూసి ఆనందపడతాయి. ఆయనకి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి.

తేజసాఽఽదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః |
బృహస్పతిసమో బుద్ధ్యా యశసా వాసవోసమః ||

తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు, క్షమించడములో భూమితో సమానమైనవాడు. బుద్ధియందు బృహస్పతితో సమానమైనవాడు. కీర్తినందు ఇంద్రుడితో సమానమైనవాడు. రాముడికి యజుర్వేదము, ధనుర్వేదము, వేదవేదాంగములు తెలుసు " అని చెపుతూ రాముడి కాలిగోళ్ళ నుంచి శిరస్సు మీద ఉండే వెంట్రుకల వరకూ ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు. (ఆ సమయంలోనే రాముడు 96 inches అనగా (8 feet) ఉంటాడని హనుమంతుడు చెప్పాడు.)

" అమ్మా! రాముడు మర్యాదా పురుషోత్తముడు. ఎవరిని ఎప్పుడు ఏ లోకంలో ఎలా కాపాడాలో తెలిసున్నవాడు. నడువడి ప్రధానమైనవాడు. ఆయన కర్త, కారణమై ఈ సమస్త జగత్తునందు నిండిపోయాడు.

వానరోఽహం మహాభాగే దూతో రామస్య ధీమతః |
రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకమ్ ||

ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా |
సమాశ్వసిహి భద్రం తే క్షీణదుఃఖఫలా హ్యసి ||

( ఈ శ్లోకములు పరమపావనమైనవి. వీటిని సుందరకాండలో మంత్రం అంటారు. సీతమ్మకి ఉన్న బాధని హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు. పదినెలల తరువాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది)

అమ్మా! నేను వానరుడిని రాముడి పలుకున వచ్చిన రామదూతని. రామనామాంకితమైన ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను నీకు నమ్మకం కలగడము కోసమని రాముడు దీనిని నాకిచ్చి పంపించాడు. ఈ ఉంగరాన్ని తీసుకున్నాక ఇవ్వాల్టితో నీ కష్టాలన్నీ పోయాయి ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు " అన్నాడు.

హనుమంతుడు ఇచ్చిన ఆ ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ సిగ్గుపడింది. రాముడినే చూసినంత ఆనందాన్ని సీతమ్మ పొందినదై ఆ ఉంగరాన్ని కన్నులకి అద్దుకొని పరవశించిపోయింది.

హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ " నాయన హనుమా ! లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరములు కుశలమే కదా! " అని పలు ప్రశ్నలు అడిగి " రాముడికి నాకన్నా ఎక్కువైనవారు ఎవరూ లేరు. నేను పక్కన లేకపోవడము వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడములో వైక్లబ్యమును పొందలేదు కదా? రాముడు కేవలము తన పౌరుషము మీదనే ఆధారపడి, దైవమును తిరస్కరించి తిరుగుతున్నాడా ? లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలము భగవంతుడిని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడా? రాముడికి నేను జ్ఞాపకము ఉన్నానా? నన్ను తలుచుకుంటున్నాడా? రావణుడిని, రాక్షసులని నిగ్రహించాలంటే రాముడు అక్కడినుండి అస్త్రప్రయోగము చెయ్యలేడా? రాముడు అస్త్రప్రయోగము చెయ్యకుండా నాయందు ఎందుకు ఉపేక్ష వహించాడు? నాకు రావణుడు పన్నెండు నెలల గడువు ఇచ్చాడు. అందులో పదినెలల కాలం పూర్తయిపోయింది. ఇంక రెండునెలలు మాత్రమే వాడు నన్ను బ్రతకనిస్తాడు. నేను ఒక నెల మాత్రమే బ్రతికి ఉంటాను. ఒక నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి ఒకవేళ రాకపోతే నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను. నేను ఇంక ఒక నెల మాత్రమే జీవించి ఉంటానని రాముడికి నివేదించు " అన్నది.

సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటలని విన్న హనుమంతుడు శిరస్సు మీద చేతులు పెట్టుకొని " ఎందుకమ్మా అలా ఖేద పడతావు? మలయము, వింధ్యము, మేరు మొదలైన పర్వతముల మా వానరములు తినే కందమూలముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, రాముడు నీయందు విశేషమైన ప్రేమతో ఆయన ఎంతో తపిస్తున్నాడు. ఎక్కడైనా ఒక అందమైన పద్మము కనపడితే ' హ సీతా! హ సీతా! ' అంటున్నాడు. వానప్రస్థులలాగ రాముడు కూడా సూర్యాస్తమయము అయ్యాక సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరము నీగురించే ధ్యానము చేస్తు ప్రతిక్షణం శోకిస్తూనే ఉన్నాడు. రాముడు ప్రస్రవణ పర్వతం గుహలో పడుకుని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్ళు, జర్రులు, పాములు పాకినా కాని ఆయనకి స్పృహ ఉండడము లేదు. నూరు యాగములు చేసి ఐరావతము మీద కూర్చున్న ఇంద్రుడి దగ్గర శచీదేవి ఉన్నట్టు, ప్రస్రవణ పర్వత గుహలో కూర్చున్న రాముడి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళి దింపుతాను. యజ్ఞంలో వేసిన హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఎంత పరమపవిత్రముగా తీసుకెళతాడో అలా నిన్ను తీసుకెళ్ళి రాముడి పాదాల దగ్గర పెడతాను. అమ్మా! నువ్వు వచ్చి నా వీపు మీద కుర్చో " అన్నాడు.
హనుమంతుడు అప్పటిదాక చాలా చిన్నగా ఉండడము వలన సీతమ్మ హనుమని చూసి ఫక్కున నవ్వి " ఎంతమాట అన్నావు హనుమ! నువ్వే ఇంత స్వరూపము ఆ వీపు మీద నేను కూర్చోనా! నన్ను ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళతావా ! నీ వానర బుద్ధిని బయటపెట్టావు కదా! " అన్నది.
సీతమ్మ మాటకి అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకి చూపించాలి అనుకొని, మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టు ఎలా ఉంటాయో అలా పర్వత స్వరూపమును పొందాడు. హనుమంతుడు పెద్ద పాదములతో, బలిసిన తొడలతో, సన్నటి నడుముతో, విశాలమైన వక్షస్థలముతో, శంఖంలాంటి కంఠముతో, కాల్చిన పెనంలాంటి ముఖముతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతో, పరిఘలవంటి భుజములతో నిలబడ్డాడు.

హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి " నాయనా! నువ్వు ఎవరివో నాకు తెలుసు. నూరు యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరో గుర్తించాను. ఇలా రాగలిగిన శక్తి గరుత్మంతుడికి, నీ తండ్రి వాయుదేవుడికి, నీకు ఉన్నది. నువ్వు ఇంత సమర్ధుడవు కాకపోతే రాముడు నిన్ను నా దగ్గరికి పంపడము జరగదు. నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను సముద్రములో పడిపోవచ్చు లేకపోతే రాక్షసులు నీ దారికి అడ్డు వస్తే నీకు వాళ్ళకి యుద్ధం జరగచ్చు. ఆ సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావా? లేక నన్ను కాపాడుకుంటావా? ఒకవేళ ఏ కారణము చేతనైనా నేను రాక్షసులకి దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశములో దాచివేయవచ్చు.  నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి రావడము కుదరదు. అమ్మా! నేను యుద్ధం చెయ్యగలను. నిన్ను క్షేమముగా రాముడి దగ్గరికి తీసుకువెళతాను అని అంటావేమో నేను స్పృహలో ఉండగా తెలిసి తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి " అన్నది.

  హనుమంతుడు " తల్లీ ! ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ, ఇప్పుడు కూడా ' నేను రాను ' అనడము నీకే చెల్లింది. నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా! పోని రాముడి దగ్గరికి నేను వెళ్ళి విజ్ఞాపన చెయ్యడానికి ఏదన్నా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు " అన్నాడు.
  సీతమ్మ   " ఒకానొకప్పుడు అరణ్యవాసము చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడున్న తపోభూములలో నేను, రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము.  ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రామడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకొని తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. (రాముడికి రావణుడికి అప్పటి వరకూ ఎటువంటి శత్రుత్వం లేదు. ఇంకా కొన్ని సంవత్సరములలో అరణ్యవాసము పూర్తయ్యి రాముడు అయోధ్యకి వెళ్ళిపోతాడు. అవతార ప్రయోజనము కోసం రావణుడు సీతమ్మని ఎలాగు అపహరిస్తాడు. సీతమ్మకి ఏదన్నా అపకారము జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకసురుడిని పంపారు. కాకాసురుడు కాకి రూపములో పర్వతం మీద ఉంటాడు) ఆ సమయంలో నేను కొన్ని మాంసపు ఒరుగులు (వడియాలు) అక్కడ ఎండపెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషముగా నాతో మాట్లాడుతున్నాడు.

  కాకసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ ఒరుగులని తినడము ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డని తీసి ఆ కాకి మీదకి విసిరాను. అప్పుడా పక్షి నా వక్షస్థలం మీద వాలి, తన ముక్కుతో గాడి వేసి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన నా వడ్డాణం జారింది. నేను ఆ వడ్డాణము తీసి కాకి మీదకి విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి ' సీతా ! కాకి మీదకి బంగారు వడ్డాణము విసురుతావా! ' అన్నాడు. తరువాత నేను ఆ బాధని ఓర్చుకొని రాముడి ఒడిలో తల పెట్టుకొని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తల పెట్టుకొని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళీ కొంతసేపటికి నేను నిద్రలేచాను. అప్పుడు రాముడు నా ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. మళ్ళీ ఆ కాకసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చుని, గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తిన్నది. నా శరీరం నుండి నెత్తురుకారి రాముడి నుదిటి మీద పడింది. రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చూసేసరికి వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ నేను ఏడుస్తూ కనపడ్డాను. ఆయన నోటినుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది ' ఎవడురా అయిదు తలల పాముతో ఆటలాడినవాడు ' అని గద్దించాడు. (సీతమ్మని పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు) చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తురుతో, మాంసం ముక్కతో, కాళ్ళకి నెత్తురుతో ఒక కాకి కనపడింది.

  రాముడు అక్కడ ఉన్న ఒక దర్భని(గడ్డిని) తీసి, దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి (మంత్రపూరితమైన అస్త్రములని ప్రయోగించేటప్పుడు బాణములు అవసరంలేదు. దేనిమీద అయినా ఆ మంత్రాన్ని అభిమంత్రించి ప్రయోగించచ్చు) విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది. ఆ కాకి మూడులోకములు తిరిగి అందరి దగ్గరికి వెళ్ళింది. కఅందరూ ' రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగము చేస్తే మేము రక్షించలేము ' అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకి తిరిగి తిరిగి రాముడున్న చోటకి వచ్చి నమస్కారము చేస్తూ పడిపోయింది (మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్నవాడిని ఆ అస్త్రం కొట్టదు. ఎదురుతిరిగి యుద్ధం చేసినవాడినే అది కొడుతుంది. కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురుతిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది ఆయనని సంహరించలేదు).

రాముడు ఆ కాకిని చూసి ' నా దగ్గరికి వచ్చి శరణాగతి పడిపోయావు. నేను నిన్ను విడిచిపెడుతున్నాను. ఒకసారి బ్రహ్మాస్త్రప్రయోగము చేసిన తరువాత ప్రాణములతో సమానమైనదానిని ఇచ్చెయ్యాలి. మరి నువ్వు ఏమిస్తావు? ' అని ఆ కాకసురుని  అడిగాడు.

  కాకాసురుడు తన కుడికన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారముగా వేసి రాముడికి నమస్కారము  చేసి, దశరథుడికి నమస్కారము చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవ్వాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు " అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకి చెప్పింది.

  సీతమ్మ " శత్రువులను సంహరించగలిగిన సమర్ధత కలిగిన ఓ హనుమా! నా వల్ల చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్య దేవి లోకమునంతటిని రక్షించే కొడుకుని కన్నది, ఆ రాముడి పాదాలకు సాంజలి బంధకంగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా రాముడు ఆ బాధని పొందలేదు అంటే లక్ష్మణుడు పక్కన ఉండడమే కారణం. వదినని తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు, ఆ లక్ష్మణుడిని, సుగ్రీవుడిని కుశలమడిగానని చెప్పు. హనుమా! నీ యొక్క వాక్కులద్వారా రామచంద్రమూర్తి మనస్సులో నాయందు ఉన్నటువంటి ప్రేమని ఉద్దీపింప చేసి నన్ను తొందరలో తీసుకువెళ్లేటట్టు చెయ్యి " అన్నది.

 హనుమంతుడు " అమ్మా! కాకాసుర వృత్తాంతము చెప్పావు, దీనితోపాటుగా ఇంకొక అభిజ్ఞానాన్ని ఇస్తే తీసుకువెళతాను " అన్నాడు.

  సీతమ్మ తన పవిట కొంగుకి కట్టి ఉన్న మూటని విప్పి అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. (చూడమణి సముద్రజలాల నుండి పైకి వచ్చింది. దానిని దేవేంద్రుడు జనకుడికి ఒక యాగంలో బహూకరించాడు) ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సుయందు మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని ఇస్తే  రాముడికి ఏకకాలంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు, మా అమ్మ, దశరథుడు, నేను జ్ఞాపకం వస్తాము "అన్నది.
హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకి అద్దుకుని. రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణము చేతిలో పడగానే ఆయనకి విశేషమైన శక్తి, ధైర్యం కలిగింది.

సీతమ్మ" ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో నా నొసటన పెట్టుకున్న తిలకం మరుగునపడితే రాముడు అక్కడున్న ఒక కుంకుమ శిలని అరగదీసి నా బుగ్గమీద చుక్క పెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి " అన్నది.

  హనుమంతుడు " నేను బయలుదేరతాను " అంటే " నాయన! పది నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను కాని ఒక్కనాడు రామనామం వినలేదు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చి రామ కథ చెప్పావు. నా మనస్సు పొంగిపోయింది. అంత తొందరగా నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు చాలా బెంగగా ఉంది. ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశములో ఇవ్వాళ ఉండి రేపు నాకు కనపడి మళ్ళీ ఒక్కసారి రామకథ నాకు చెప్పు. ఇవ్వాల్టికి ఉండు హనుమా " అని, ఇంటినుంచి దూరముగా వెళుతున్న కొడుకుని కన్నతల్లి అడిగినట్టు సీతమ్మ హనుమంతుడిని అడిగింది.

  హనుమంతుడు " అమ్మా! నువ్వు బెంగపడవద్దు. రాముడు కూడా నీమీద బెంగ పెట్టుకుని శోకిస్తున్నాడు " అన్నాడు.

  సీతమ్మ " నువ్వు చెప్పిన మాట నాకు మళ్ళీ శోకం కలిగిస్తోంది. రాముడు నాకోసం శోకిస్తున్నాడన్న మాట చాలా బాధగా ఉన్నది. హనుమ! నూరుయోజనముల సముద్రాన్ని దాటి నువ్వు, గరుత్మంతుడు, వాయుదేవుడు వస్తారు. ఇంక ఎవరూ ఇక్కడికి రాలేరు. మరి రావణ సంహారము ఎలా జరుగుతుంది? " అన్నది.

మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ  సంతి తత్ర వనౌకసః  |
మత్తః  ప్రత్యవరః  కశ్చిత్  నాస్తి సుగ్రీవ సన్నిధౌ ||
హనుమంతుడు " సుగ్రీవుడి దగ్గర నాతో సమానమైన బలం ఉన్నవాళ్లు ఉన్నారు. నాకన్నా అధికమైన బలం ఉన్నవాళ్లు ఉన్నారు. నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు సుగ్రీవుడి దగ్గర లేడమ్మా! (ఈ మాట హనుమంతుడి వినయానికి నిదర్శనం) నేను వెళ్ళి రాముడికి చెప్పి తొందరలోనే వానర సైన్యంతో లంకాపట్టణానికి వచ్చి రావణుడిని సంహరిస్తాము "

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.