SRIMADRAMAYANA (Sundarakanda) by Chaganti Koteswara Rao Garu - S2

S2

SRIMADRAMAYANA PRAVACHANAMRUTHADHARA -- 2 BY PUJYAGURUVULU Brahmasri Chaganti Koteswara Rao Garu

లంబగిరి పర్వతం మీద దిగిన హనుమంతుడు సముద్రము వంక చూసి " రాముడి అనుగ్రహము ఉండాలి కాని ఇలాంటి యోజనములు ఎన్ని అయినా దాటి వస్తాను " అన్నాడు.
‘ధృతి-దృష్టి-మతి-దాక్ష్యము’ అనే ఈ నాలుగింటిని ఎవరు తమ పనులలో కలుపుకుంటున్నారో వారికి జీవితములో ఓటమి అన్నది లేదని వాల్మీకి మహర్షి చెప్పారు. ధృతి అంటే పట్టుదల, దృష్టి అంటే మంచి బుద్ధితో ఆలోచించగల సమర్ధత, మతి అంటే బుద్ధితో నిర్ణయించవలసినది, దాక్ష్యం అంటే శక్తి సామర్ధ్యాలు.
ఆ పర్వతం మీద దిగిన హనుమంతుడు విశ్వకర్మ నిర్మితమైన లంకాపట్టణము యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ లంకాపట్టణమును సొంతం చేసుకోవడము ఆ దేవతల వల్ల కూడా కాదు అని అనుకొని ఈ రూపముతో సీతమ్మని వెతకడము కష్టం కనుక పిల్లి రూపంలో సీతమ్మని వెతుకుతాను అనుకున్నాడు. చీకటి పడ్డాక ఆయన పిల్లి స్వరూపాన్ని పొంది లంకయొక్క రాజద్వారము దగ్గరికి వెళ్ళాడు.
అక్కడికి వెళ్ళేసరికి వికటాట్టహాసం చేస్తూ పర్వతమంత ఆకారముతో ఒక రాక్షస స్త్రీ కనపడింది. ఆమె హనుమంతుడిని చూడగానే " నువ్వు ఎవరు? అరణ్యములలో తిరిగే కోతివి నీకు ఇక్కడ పని ఏమిటి? ఇక్కడికి ఎందుకొచ్చావు? " అని అడిగింది.
హనుమంతుడు " ఓ వికృతమైన కన్నులున్నదానా ! నేను ఒకసారి ఆ వనములను, ఉపవనాలని, చెట్లని, భవనాలని, సరస్సులని చూసి వచ్చేస్తాను నాకు అనుమతి ఇవ్వు " అన్నాడు.
ఆవిడ " నేను అనుమతి ఇవ్వడము కాదు, నన్ను గెలిచినవాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు. నువు లోపలికి వెళ్ళడానికి వీలులేదు " అన్నది.
హనుమంతుడు "సరే ఇంతకీ నువ్వు ఎవరు? " అని ఆ స్త్రీని ప్రశ్నించాడు.
ఆమె " నేను లోపల ఉన్న మహాత్ముడైన రావణుడి పనుపున ఈ లంకాపట్టణానికి కాపలా కాస్తుంటాను " అని చెప్పి చటుక్కున హనుమంతుడిని తన చేతితో ఒక దెబ్బ కొట్టింది.
ఆ దెబ్బకి హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చి కుడి చేతితో కొడితే ఈమె చనిపోతుందని, తన ఎడమ చేతితో ఆమెని ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి ఆమె కళ్ళు తేలేసి కిందపడిపోయింది.
అప్పుడామె " నన్ను లంఖిణి అంటారు. నువ్వు నన్ను గెలిచావు, నేను ఈ రావణాసురుడి బాధ భరించలేకపోతున్నాను. కొన్ని వేల సంవత్సరాల నుండి నన్ను విసిగిస్తున్నాడు. ' ఒక వానరుడు వచ్చి నిన్ను గెలిచిననాడు, నీకు ఈ రావణుడి పీడ వదిలిపోతుంది ' అని బ్రహ్మగారు నాకు వరము ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్ధమయ్యింది ఈ లంకలోని రాక్షసుల పని రావణుడి పని అయిపోయింది. ఇక నువ్వు లోపలికి వెళ్ళి సీతమ్మని కనిపెట్టు " అని రాజద్వారం తెరిచింది.
హనుమంతుడు అక్కడున్న గోడమీద నుంచి ఎగిరి లోపలికి ఎడమకాలు పెట్టి దూకాడు. లోపలికి వెళ్ళి ఆ లంకాపట్టణాన్ని చూడగా ఇది గంధర్వనగరమా అన్నట్టుగా ఉన్నది. అక్కడున్న మేడలు, స్తంభములు బంగారముతో చెయ్యబడి ఉన్నాయి. అన్నిటికీ నవరత్నాలు తాపడము చెయ్యబడి ఉన్నాయి. స్ఫటికములతో మెట్లు కట్టబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా దిగుడుబావులు, సరోవరాలతో ఆ ప్రాంతము శోభిల్లుతున్నది. ఆ ప్రాంతం చెట్లతో, పక్షులతో, పళ్ళతో, నెమళ్ళ అరుపులతో, ఏనుగులతో, బంగారు రథములతో అత్యంత రమణీయముగా ఉన్నది. ఆ రాత్రి పూట ఆకాశములో ఉన్న చంద్రుడు వెన్నెల కురిపిస్తూ లోకం యొక్క పాపం పోగొట్టేవాడిలా ఉన్నాడు. ఆ చంద్రుడి ప్రకాశములో హనుమంతుడు లంకాపట్టణములోని వీధులలో సీతమ్మ కోసం వెతుకుతున్నాడు.
లంకాపట్టణములో ఉన్నవాళ్లు దీక్షితులు, కొంతమంది తల మీద వెంట్రుకలన్ని తీయించుకున్నారు. కొంతమంది ఎద్దు చర్మములు కట్టుకొని ఉన్నారు. కొంతమంది దర్భలని చేతితో పట్టుకొని ఉన్నారు. కొంతమంది అగ్నిగుండములు చేతితో పట్టుకొని ఉన్నారు. ఒకడు పక్కవాడికి తన ఛాతిని చూపిస్తున్నాడు. కొంతమంది తమ శరీరాలని కనపడ్డ స్త్రీల మీద పడేస్తున్నారు. కొంతమంది ఎప్పుడూ తమ చేతులలో పెద్ద పెద్ద శూలాలు పట్టుకొని ఉన్నారు. కొంతమంది పరస్పరం ఒకడిని ఒకడు తోసుకుంటూ ఉన్నారు. తమ భుజాల బలాలని చూపించుకుంటు ఉన్నారు. ఒకడిని మరొకడు అధిక్షేపించుకుంటు మాట్లాడుకుంటున్నారు. ఆ లంకలో ఒకడు శూలం, ఒకడు ముద్గరం, ఒకడు పరిఘ, రకరకములైన ఆయుధములు పట్టుకొని ఉన్నారు.
ప్రహస్త, కుంభకర్ణ, మహోదర, విరూపాక్ష, విద్యున్మాలి, వజ్రదంష్ట్ర, సుఖ, సారణ, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, రస్మికేతు, సూర్యకేతు, వజ్రకాయ, ధూమ్రాక్ష, భీమ, ఘన, హస్తిముఖ, కరాళ, పిశాచ, మత్త, ధ్వజగ్రీవ, సుకనాస, వక్ర, శట, వికట, బ్రహ్మకర్ణ, దంష్ట్ర, రోమస అని అక్కడ రాక్షసుల పేర్లు.
హనుమంతుడు రాక్షసుల అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి సీతమ్మ కోసం వెతికారు. ఆ సమయములో రాక్షస స్త్రీలు తమ భర్తలతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారు.
ఆ స్త్రీలందరినీ చూసిన హనుమంతుడు అనుకున్నాడు " మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు. మా సీతమ్మ కనిపించి కనపడకుండా ఉండే చంద్రరేఖలా ఉంటుంది. మట్టిపట్టిన బంగారు తీగలా ఉంటుంది. బాణపుదెబ్బ యొక్క బాధలా ఉంటుంది. వాయువు చేత కొట్టబడ్డ మేఘములా ఉంటుంది " అనుకుంటూ లంకాపట్టణాన్ని వెతుకుతూ రావణాసురుడి యొక్క ప్రాసాదము దగ్గరికి వెళ్ళాడు.
అది రాక్షసేంద్రుడైన రావణాసురుడి అంతఃపురం. దానికి మొదటి కక్ష్యలో కొంతమంది గుఱ్ఱాల మీద కాపలా కాస్తుంటారు. రెండవ కక్ష్యలో ఏనుగుల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఆ వెనక కక్ష్యలో కొంతమంది కత్తులు పట్టుకొని తిరుగుతుంటారు. ఆ తరువాత కక్ష్యలో ప్రభువు నిద్రలేవగానే ఒంటికి రాయడానికి కొంతమంది చందనం తీస్తుంటారు. తరువాత కక్ష్యలో ఆయన ధరించే పుష్పమాలికలు ఉంటాయి. ఆ వెనకాల ఆయనకి బాగా నిద్ర పట్టడానికి వాద్యపరికరాల మీద సన్నటి సంగీతాన్ని కొంతమంది వాయిస్తూ ఉంటారు.
' ఇంకా అందరూ నిద్రపోలేదు కనుక కొంతసేపయ్యాక రావణ అంతఃపురంలోకి వెళ్ళి చూస్తాను ' అని హనుమంతుడు అనుకొని బయటకి వచ్చి మళ్ళీ కొన్ని ఇళ్ళల్లోకి వెళ్ళి చూశాడు. ఆ ఇళ్ళల్లో ఉన్న రాక్షసులు లంకకి పూజ చేస్తూ శంఖాలు, భేరీలు, గంటలు మోగిస్తున్నారు. అక్కడ ఉన్న ఇళ్ళు చూసి " ఇది ఇంద్రపురా! గంధర్వ నగరమా! పొరపాటున నేను స్వర్గలోకానికి వచ్చానా?. అసలు ఇంద్రుడికి ఎన్ని భోగములు ఉన్నాయో అవన్నీ ఈ లంకా పట్టణములో కనిపిస్తున్నాయి " అనుకున్నాడు. అక్కడున్న ఇళ్ళల్లో ఎంత గొప్ప పండితుడైనా ఒక దోషాన్ని కూడా చూపలేడు. అంత అద్భుతముగా అక్కడి ఇళ్ళు ఉన్నాయి. దేవతలకి కూడా ఆ ఇళ్ళల్లోకి వస్తే పూజ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడున్న కిటికీలు కూడా వజ్ర వైడుర్యాలతో అలంకరింపబడి చాలా అందముగా ఉన్నాయి. ఆ లంకాపట్టణము యొక్క శోభని హనుమంతుడు చాలా బలంతో చూశాడు (లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి, తాను వచ్చిన కార్యాన్ని మరిచిపోకుండా ఉండాలని హనుమంతుడు ఆ నగరము యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు సీతమ్మని కనిపెట్టాలనే విషయాన్ని మనస్సులో బలంగా పెట్టుకొని ఉన్నాడు). ఆ రాక్షసుల ఇళ్లన్నీ వెతికిన తరువాత హనుమంతుడు మెల్లగా రావణ అంతఃపురంలో ఉన్న పుష్పక విమానములోకి ప్రవేశించాడు. ( పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మించి బ్రహ్మకి ఇచ్చాడు. కొంతకాలానికి కుబేరుడు బ్రహ్మని గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు కుబేరుడికి పుష్పక విమానాన్ని ఇచ్చాడు. కుబేరుడి తమ్ముడైన రావణుడు ఆయనని చావగొట్టి ఆ విమానాన్ని తెచ్చుకున్నాడు). ఆ పుష్పక విమానములో కూర్చుని మనస్సులో ఒక ప్రదేశాన్ని ఊహించుకుంటే అది వాళ్ళని కన్నుమూసి తెరిసేలోగా అక్కడికి తీసుకువెళుతుంది. ఆ పుష్పకానికి వజ్ర వైడుర్యాలతో నగిషీలు పెట్టబడి ఉంటాయి. అందులో సరోవరాలు, పద్మాలు, ఉద్యానవనాలు, బంగారముతో చెయ్యబడ్డ వేదికలు, కూర్చోడానికి ఆసనాలు, పడుకోడానికి తల్పాలు, విహరించడానికి ప్రదేశాలు ఉంటాయి. అందులోకి ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకడికి చోటు ఉంటుంది. అందులో ఉన్న తివాచిమీద ఈ భూమండలము అంతా చిత్రీకరించబడి ఉన్నది. ఈ భూమి మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయో, అవన్నీ ఆ తివాచి మీద చెక్కబడి ఉన్నాయి. అలాగే ఏ పర్వతం మీద ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్లు అందులో ఉన్నాయి. వాటితో పాటు ఆ చెట్లకి ఉన్న పువ్వులే కాకుండా ఆ పువ్వులలో ఉన్న కేసరములు కూడా చెక్కబడి ఉన్నాయి. దానికి కొంచెం పక్కనే లక్ష్మీదేవి పద్మములలో పద్మాసనము వేసుకొని నాలుగు చేతులతో కూర్చున్నట్టుగా, రెండు ఏనుగులు బంగారు కలశములు పట్టుకొని, పద్మపు రేకులతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా అక్కడ ఒక చిత్రము ఉన్నది.
హనుమంతుడు " మా అమ్మ ఇలాంటి స్థలములో ఇలా రాక్షసులతో మధ్యం సేవించి ఆనందంగా ఉండదు. మా అమ్మ కన్నులవెంట వేడి నీరు కారుతూ వక్షస్థలం మీద పడిపోతూ ఉంటుంది. రాముడి చేత కట్టబడిన దీర్ఘమైన మంగళసూత్రం మా అమ్మ మెడలో మెరుస్తూ ఉంటుంది. మా అమ్మ కన్నులకు ఉన్న వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా ఉంటాయి, పరిపూర్ణమైన ప్రేమ కురిపించే కన్నులతో మా అమ్మ ఉంటుంది. వనములో ఉన్న నెమలిలా మా అమ్మ ఉంటుంది " అనుకుంటూ పుష్పక విమానము నుంచి కిందకి దిగి రావణాసురుడు పడుకున్న శయనాగారం వైపు వెళ్ళాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.