SRIMADRAMAYANA (Sundarakanda)by Chaganti Koteswara Rao Garu - S1

SRIMADRAMAYANA PRAVACHANAMRUTHADHARA -- 1 BY PUJYAGURUVULU Brahmasri Chaganti Koteswara Rao Garu

సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథా|
సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనమ్ ||
సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః |
సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరమ్||
పెద్దలైనవారు సుందరకాండ గురించి ఈ మాట అన్నారు. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు.
రాముడు సుందరాతి సుందరుడు. సీతమ్మ గురించి చెప్పనవసరం లేదు. ఆత్మ దర్శనం చేసిన యోగి స్వరూపుడైన సౌందర్యరాశి హనుమంతుడు. ఆ అశోకవనము అంతా సౌందర్యము. లంకా పట్టణం సౌందర్యము. మంత్ర్రం సౌందర్యం. మరి ఈ సుందరకాండలో సుందరం కానిది ఏముంది?
సుందరకాండ తత్ తో ప్రారంభమయ్యి తత్ తో ముగుస్తుంది. తత్ అంటే పరబ్రహ్మము. సుందరకాండని ఉపాసనకాండ అంటారు. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో ఈ కాండ మనకి నేర్పిస్తుంది.
తతో రావణనీతాయాః సీతాయాశ్శత్రుకర్శనః |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||
రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడము కోసం చారణులు(భూమికి దగ్గరగా ఉండి సర్వకాలములయందు శుభవార్తలను చెప్పే దేవతా స్వరూపులు) వెళ్ళే మార్గంలో వెళ్ళడము కోసం హనుమ సంకల్పించాడు. ఎవ్వరూ చెయ్యని పనిని చెయ్యడానికి వెళుతున్న హనుమంతుడు ఆ పర్వతం మీద ఒక గొప్ప ఎద్దు నిలబడినట్టు నిలబడి ఉన్నాడు. వైఢూర్యముల వలే మెరుస్తున్న ఆ పర్వత శిఖరం మీద ఉన్న పచ్చగడ్డిని తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడాయన బయలుదేరేముందు సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి, సమస్త భూతములకు నమస్కారము చేసి ప్రయాణానికి సన్నద్ధుడు అవుతున్నాడు. ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి దక్షిణదిక్కు వంక ఏకాగ్రతతో చూసి గట్టిగా తన పాదములతో మహేంద్రగిరి పర్వత శిఖరములను తొకక్కితే ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలి ఆయన మీద పడ్డాయి. ఆ పర్వతం మీద ఉన్న గుహలు నొక్కుకుపోయాయి.
హనుమంతుడు తన పాదములతో ఇంకా గట్టిగ ఆ పర్వతాన్ని తొక్కారు. ఎన్నాళ్ళనుంచో ఆ పర్వతం మీద కలుగులలో ఉన్న పాములు కలుగు నొక్కుకుపోతుందని బయటకి వచ్చేలోపే ఆ కలుగు నొక్కుకుపోయి కొంత భాగం బయట, కొంత భాగం లోపల ఉండిపోయింది. అప్పుడా పాములు ఆ బాధని తట్టుకోలేక అక్కడున్న శిలలకి కాట్లు వేశాయి. ఆ విషములోనుండి పుట్టిన అగ్ని ఆ మహేంద్ర పర్వత శిఖరములని కాల్చివేసింది. అప్పటిదాకా ఆ పర్వత శిఖరం మీద తమ భార్యలతో ఉన్నటువంటి గంధర్వులు ఒక్కసారి లేచి ఆధారము లేని ఆకాశములోకి వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయారు.
ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజః |
తితీర్షతి మహావేగః సముద్రం మకరాలయమ్ ||
అక్కడికి దేవతలు, మహర్షులు మొదలైనవారు వచ్చారు. ఆకాశ ప్రాంతము అంతా నిండిపోయింది. వాళ్ళు " ఏమి ఆశ్చర్యము ! పర్వత స్వరూపమైన శరీరము ఉన్న హనుమంతుడు ఇవ్వాళ ఈ సముద్రమును దాటి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు " అని అనుకుంటూ హనుమంతుడిని ఆశీర్వదించారు.
హనుమంతుడు తన తోకని ఒకసారి పైకి ఎత్తి అటూ ఇటూ ఊపి, ఊపిరిని తీసి తన వక్షస్థలంలో నిలబెట్టి, గట్టిగా తన పాదాలతో ఆ పర్వతాన్ని తొక్కి, తొడలని విశాలంగా పక్కకు పెట్టి, ఒకసారి అక్కడున్న వానరముల వంక చూసి " రాముడి కోదండమునుండి విడువబడ్డ బాణములా నేను లంకా పట్టణము చేరుకుంటాను. అక్కడ సీతమ్మ దర్శనము అయితే సరే, లేకపోతే అక్కడినుండి స్వర్గలోకానికి వెళ్ళి సీతమ్మని వెతుకుతాను. ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గలోకంలో కనపడకపోతే అదే వేగముతో లంకకి తిరిగొచ్చి రావణుడిని బంధించి రాముడి పాదములకు సమర్పిస్తాను " అని ప్రతిజ్ఞ చేసి తన పాదము పైకెత్తి ఆ పర్వతం మీదనుండి బయలుదేరాడు.
హనుమంతుడు అలా వేగముగా పైకి లేచేసరికి కొన్ని వేల సంవత్సరాలనుండి ఆ పర్వతం మీద పాతుకుపోయిన మహావృక్షములు వేళ్ళతో సహా ఆయనతో పాటు పైకి లేచాయి. ఆకాశములో వెళుతున్న హనుమంతుడి మీద ఆ చెట్లు పుష్పములను కురిపించాయి. తేలికయిన చెట్లు కూడా చాలాదూరము వెళ్ళాయి. బరువైన చెట్లు ముందుగానే పడిపోయాయి. అలా వెళుతున్న హనుమంతుడిని చూసినవారికి " ఈయన ఆకాశమును తాగుతున్నాడా? సముద్రాన్ని తాగుతున్నాడా ? " అని అనుమానము వచ్చింది. పసుపుపచ్చని కళ్ళతో హనుమంతుడు మెరిసిపోతున్నాడు. ఎర్రటి నోరుతో సూర్యమండలం వెలిగిపోతున్నట్టు ఆయన ముఖం వెలిగిపోతుంది. ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టినట్టు చుట్టి పైకి ఎత్తేసాడు. అప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న తిమింగలాలు, తాబేళ్లు, చేపలు, రాక్షసులు పైకి కనపడ్డారు. హనుమంతుడు ఒక్కొక్కసారి మేఘాలలోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకి వస్తూ ముందుకి వెళుతున్నాడు.
హనుమంతుడు అంత వేగముతో వెళిపోతుంటే కిందనుంచి సాగరుడు చూసి " సాగరములు ఏర్పడడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణం. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసము హనుమంతుడు సాగరము మీద నుంచి వెళుతున్నాడు. ఆయనకి ఆతిథ్యము ఇవ్వడము మన ధర్మం " అని అనుకొని తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి " నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళలోకములో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్రమార్గమునుండి భూమి మీదకి వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండడానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డావు. ఇక కింద వాళ్ళు పైకిరారని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కాని నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి, కిందకి, పక్కలకి పెరగగలవు. నువ్వు హనుమంతుడికి ఆతిథ్య ఇవ్వడము కోసమని ఒకసారి పైకి లేస్తే ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు " అన్నాడు.
ఆ మైనాక పర్వత శిఖరాలు సముద్రము నుండి పైకి వచ్చాయి. బయటకి వచ్చిన ఆ బంగారు శిఖరముల మీద సూర్యకాంతి పడగానే ఆకాశము అంతా ఎర్రటిరంగు చేత కప్పబడింది. ఆ శిఖరములను చూసిన హనుమంతుడు " ఓహో ఇప్పటివరకూ ఈ శిఖరాలు కనపడలేదు. ఇప్పుడే సముద్రమునుండి ఈ బంగారు శిఖరములు పైకి వస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డువస్తున్నారు " అని అనుకొని తన వక్షస్థలముతో ఆ శిఖరాలని ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకి శిఖరాలు చూర్ణమయ్యి కింద పడిపోయాయి.
మైనాకుడు మనుష్య రూపము పొంది తన శిఖరముల మీదనే నిలబడి " అయ్యా! మామూలువాడే అతిథిగా వస్తే విడిచిపెట్టము. మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిధివి. ఉపకారం చేసినవాడికి ప్రత్యుపకారం చెయ్యడమనేది చెయ్యవలసిన పని. ఇక్ష్వాకువంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది. నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారం పొందాము. (కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు, జనములు బెంగపెట్టుకున్నారు. ఇంద్రుడు తన వజ్రాయుధముతో అన్ని పర్వతాల రెక్కలని నరికేశాడు. ఇంద్రుడు ఈ మైనాకుడి రెక్కలని కూడా నరకబోతుంటే మైనాకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రములో పారేశాడు. ' పోనిలే సముద్రంలో పడితే పడ్డాడు కాని రాక్షసులు బయటకి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు ' అని ఇంద్రుడు ఆ మైనాకుడిని వదిలేశాడు.) అందుకని నువ్వు ఒకసారి నా పర్వత శిఖరముల మీద కూర్చొని కాస్త తేనె త్రాగి, పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని మళ్ళీ హాయిగా వెళ్ళు " అన్నాడు.
హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడిని చేతితో ముట్టుకుని " నేను చాలా ప్రీతి పొందాను. నువ్వు నాకు ఆతిథ్యము ఇచ్చినట్టే నేను పొందినట్టే నా మీద కోపం తెచ్చుకోవద్దు. నేను చెయ్యవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉన్నది. సూర్యాస్తమయం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను. మధ్యలో ఎక్కడా ఆగకూడదు " అని చెప్పి వెళ్ళిపోయాడు.
బయటకి వచ్చిన మైనాకుడిని ఇంద్రుడు చూసి " ఓహో ! ఇన్నాళ్ళకి నువ్వు పాతాళమునుండి బయటకి వచ్చావు కదా! " అన్నాడు.
మైనాకుడు " ఈ ఇంద్రుడు నా రెక్కలని తరిగేస్తే తరిగేశాడు. ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చెయ్యకుండా ఈ సముద్రములో ఎంతకాలం పడి ఉండను " అనుకున్నాడు.
ఇంద్రుడు అన్నాడు " నాయనా మైనాక! ధైర్యంముగా హనుమకి సహాయం చెయ్యడము కోసం బయటకి వచ్చావు. రామకార్యం కోసం వెళుతున్నవాడికి ఆతిథ్యము ఇవ్వడమునకు బయటకి వచ్చావు కనుక నీ రెక్కలు కొయ్యను " అని అభయమిచ్చాడు.
దేవతలు నాగమాత అయిన సురసతో(సురస దక్షుని కుమార్తె) " చూసావా తల్లి! హనుమ వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషములో వెళ్ళి అడ్డంగా నిలబడి మింగేస్తానని భయపెట్టి ఆయన సామర్థ్యము పరీక్ష చెయ్యి " అన్నారు.
సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది సముద్రము నుండి బయటకి వచ్చి హనుమంతుడితో " నిన్ను దేవతలు నాకు ఆహారముగా ఇచ్చారు. నేను నిన్ను తింటాను. నువ్వు నా నోట్లోకి దూరు " అన్నది.
హనుమంతుడు సంతోషముగా రామకథని సురసకి చెప్పి " నేను సీతమ్మ జాడ కనిపెట్టడము కోసమని వెళుతున్నాను. ఒకసారి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను. ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లీ ! నేను సత్యమే మాట్లాడుతున్నాను మాట తప్పను " అన్నాడు.
 సురస " అలా కుదరదు నాకు బ్రహ్మగారి వరము ఉన్నది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే " అని తన నోరుని పెద్దగా తెరిచింది. హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరు నూరుయోజనములు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటనువేలంత చిన్నవాడిగా అయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటకి వచ్చి " అమ్మా! నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను. సరిపోయింది కదా! ఇక నేను బయలుదేరతాను " అన్నాడు.
" ఎంతో బుద్ధిబలం  నీది. రాముడితో సీతమ్మని కలిపినవాడు హనుమ అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందెదవుగాక " అని సురస హనుమంతుడిని ఆశీర్వచనము చేసింది.
 హనుమంతుడు సురసకి ఒక నమస్కారము చేసి ముందుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న హనుమంతుడిని సింహిక అనే రాక్షసి సముద్రములోనుంచి చూసింది. సింహిక కామరూపి. ఆమెకి నీడని పట్టి లాగేసే శక్తి ఉన్నది. ఆమె హనుమంతుడి నీడని పట్టి లాగడము  మొదలుపెట్టింది. తన గమనము తగ్గుతోందని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు. ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళీ  హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటిద్వార లోపలికి ప్రవేశించి ఆమె గుండెకాయని తెంపేసి బయటకి వచ్చేశాడు. గిలగిల తన్నుకొని ఆ సింహిక మరణించింది.
 ముందుకి వెళ్ళిన హనుమంతుడు లంకా పట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతము మీద దిగాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.