వివేకానందుడు ఒక కథ చెబుతుండేవాడు

వివేకానందుడు ఒక కథ చెబుతుండేవాడు - ఒక రైతు దగ్గర ఒక ముసలి గాడిద ఉండేది. ఒకరోజు దారి సరిగా కనబడక పాడుబడ్డ నూతిలో పడిపోయింది. రైతు ఆ గాడిదను పైకి తీసే ప్రయత్నం చేశాడు. కుదరలేదు. ‘‘ఇది ముసలిదైపోయింది. ఎక్కువ కాలం ఉపయోగపడదు. దీన్ని కష్టపడి పైకి తీసే కన్నా, నేను మరో బలమైన గాడిదను తెచ్చుకోవడం మేలు. అది కూడా దీనిలాగా ఈ బావిలో పడిపోతే మళ్లీ మరో గాడిద కొనుక్కోవాలి. ముసలి గాడిద ఎటూ పడిపోయింది కనుక, దీనిని మట్టితో కప్పేస్తే అప్పుడు బావి కూడా పూడిపోతుంది కనుక కొత్త గాడిద పడే సమస్య ఉండదు’’ అనుకుని చుట్టుపక్కల రైతులను పిలిచాడు. తలా ఒక తట్ట మట్టి తెచ్చి పోస్తున్నారు.

యజమాని వైఖరికి లోపలున్న గాడిద ఖిన్నురాలైపోయి - ఎంత దారుణం అనుకుంది. ఒక్క క్షణం ఆలోచించింది. ఇక నేను నా గురించి ఆలోచిస్తాను. తప్పుకునే మార్గాన్ని చూసుకుంటాను అనుకుంది. ఒకసారి సంకల్పం చేసుకున్నాక ధైర్యం వచ్చి లోపల గోడకు బాగా దగ్గరకు వెళ్లి నిలబడింది. పైనుంచి మట్టి పోస్తున్నారు. తనమీద పడిన దాన్ని దులుపుకుంటున్నది. పక్కన పడ్డ మట్టి ఒక దిబ్బగా మారగానే దాని మీదకు చేరుతున్నది. అలా లోపల మట్టి లెవల్ పెరిగే కొద్దీ అది కూడా పైకి జరుగుతూ బావి పైఅంచు దగ్గరకు రాగానే ఒక్కసారి శక్తి కూడదీసుకుని బావి బయటకు దూకి పారిపోయింది. ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కోలేకపోయి ఉంటే, ఆ గాడిద కూడా ఒక అవశేషంగా మిగిలిపోయి ఉండేది. స్వామి వివేకానంద యువకులకు ఈ కథ చెబుతూ ‘‘భీరువులై (పిరికివారై) బతక్కండి, ధైర్యంగా నిలబడి కష్టాన్ని ఎదుర్కోండి’’ అని చెప్పేవారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.