శ్రీ మావుళ్ళమ్మ వారి క్షేత్రం- భీమవరం

శ్రీ మావుళ్ళమ్మ వారి క్షేత్రం-  భీమవరం 

ఆది పరాశక్తి అయిన శ్రీ లలితా దేవి అనేక ప్రదేశాలలో అనేక రూపాలలో విరాజిల్లుతూ భక్తులను కాపాడుతూ వున్నది. ఆ పరమేశ్వరి పండితులు పూజించే శ్రీమాతగానేకాక పామరులు తమ తల్లిగా, తమ ఈతి బాధలను తీర్చే కరుణారసవల్లిగా, తమ గ్రామాలను కాపాడే గ్రామ దేవతగా కొలుచుకుంటారు. ఆ అమ్మ అనేక చోట్ల అనేక రూపాలతో, ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికే దయార్ద్రహృదయురాలిగా పూజలందుకుంటున్నది. అలాంటి అమ్మ ఆలయాలలో కొన్నింటిని గురించి జ్యేష్ఠ మాసం సందర్భంగా చెప్పుకుందాం. 

పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన ఏలూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమవరంలో ఉన్నది ఈ క్షేత్రము, భీమవరంలో నెలకొని వున్న మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తూ ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు. పూర్వం ఈ చుట్టుప్రక్కల అంతా మామిడి తోటలు వుండేవిట. అందుకే ఈ అమ్మవారిని మావుళ్ళమ్మ....మావిడి చెట్లల్లో వున్న అమ్మ అనేవారని కొందరి కధనం. ఇంకొందరు చెప్పేదేమిటంటే ఈ చుట్టుప్రక్కల వున్న వూళ్ళన్నిటిని చల్లగా కాపాడే తల్లని ప్రతివారూ మా వూళ్ళ అమ్మ ...మా వూళ్ళకి అమ్మ...అనేవారు.. ఆ పేరే మావుళ్ళమ్మ అయింది.

వంద సంవత్సరాల పైన చరిత్రగల ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం మొదట్లో భీకరంగా వుండేది. ఆ విగ్రహం 1910 లో వచ్చిన వరదలలో పాక్షికంగా దెబ్బతినటంతో శ్రీ గ్రంధి అప్పారావుచే మలచబడ్డ ఇప్పటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారు కరుణారసమూర్తి. చతుర్భుజ అయిన ఈ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తు వుంటుంది. నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం వున్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగావుండే ఆ తల్లి కూర్చున్నట్లు వుంటుంది.ఈ తల్లి చల్లని దీవెనలతోనే తమ ప్రాంతం సుభిక్షంగా వుందని అక్కడి ప్రజల విశ్వాసం.ప్రతి సంవత్సరం జనవరి 14నుంచి నెల రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.

ఆలయ విశిష్టత

***************

ఈ క్షేత్రంలో గర్భాలయానికి ఇరువైపులా గౌతమ బుద్ధుని, రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉండడము ఇందలి ప్రత్యేకత. అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు.... చీరలు వంటి వాటిద్వారా ప్రతియేటా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం అమ్మవారికి ఆభారణాల రూపంలో 24 కిలోల బంగారం, 274 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. అమ్మవారికి 65 కిలోల బంగారంతో చీర ఆభరణాలు తయారు చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. దీని కొరకు స్థానిక ప్రముఖులు.... విదేశాలలో ఉన్నవారు స్పందిస్తున్నారు. అమ్మవారికి 16 కిలోల బంగారంతో త్రిశూలం, ఢమరుకం తయారు చేశారు. ప్రస్తుతం అమ్మవారికి బంగారు కిరీటము, త్రిశూలము ఉన్నాయి. ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఉండడము, ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగడము దేశంలో మరెక్కడా లేదని అదే ఈ ఆలయ విశిష్టత

విజయవాడకి 103 కిలో మీటర్ల దూరంలో వున్న ఈ వూరికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. సమీప ఎయిర్ పోర్టు విజయవాడ. భీమవరం రైలు స్టేషను నుంచి గుడి 2 కి.మీ.ల లోపే వుటుంది. బస్ స్టాడునుంచి గానీ, రైల్వే స్టేషను నుంచి గానీ అటో తీసుకుంటే గునుపూడి సోమేశ్వరాలయం (పంచారామాలలో ఒకటి), యనమదుర్రు శక్తేశ్వర స్వామి దేవాలయం, భీమవరం మావుళ్ళమ్మ దేవాలయం చూసి రావచ్చు. అన్నీ కలిపి 10 -15 కి.మీ. ల దూరంలోనే వున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.