గాయత్రి జయంతి

*🌹. శ్రీ గాయత్రి దేవి.. మహాత్మ్యం - విశిష్టత 🌹*
*📚. *గాయత్రి స్తోత్రము,మరియు  గాయత్రి అష్టకము*
 
గాయత్రి జయంతి సందర్భంగా మనము తెలుసు కోవాల్సిన ముఖ్యమైన  విషయాలు*

*🌻. ప్రార్ధన : 🌻*

*ముక్తా విద్రుమ హేమ నీల ధవళచాయై ముఖైస్త్రీ క్షణైః*
*యుక్తామిందు నిబద్ధరత్న మకుటామ్త త్వార్ధ వర్ణాత్మికామ్*
*గాయత్రీం వరదా* *భయాంకుశ* *కశాశ్శుభ్రమ్కపాలం గదామ్*
*శంఖం చక్రమధార విందం యుగళమ్హ సైర్వహం తీం భజేే*

గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపఈ రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.

అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింపబడుతుంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది.

నవరాత్రులలో ఈ రోజు అమ్మవారిని ఉపాసన చేసి, అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.

*🌻. శ్రీ గాయత్రీ మాత మహాత్యం  🌻*

వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.

*ఓం భూర్భువః స్వాహా....... ప్రచోదయాత్‌*

ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.

త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.

బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.

*🌻. గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.*
*గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు: 🌻*

*01. వినాయకుడు:* సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.

*02. నృసింహ స్వామి:* పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.

*03. విష్ణుమూర్తి:* పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.

*04. ఈశ్వరుడు:* సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.

*05. శ్రీకృష్ణుడు:* యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.

*06. రాధాదేవి:* ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.

*07. లక్ష్మీదేవి:* ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.

*08. అగ్నిదేవుడు:* తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.

*09. మహేంద్రుడు:* రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.

*10. సరస్వతి:* విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.

*11. దుర్గాదేవి:* దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

*12. ఆంజనేయుడు:* నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.

*13. భూదేవి:* ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.

*14. సూర్య భగవానుడు:* ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.

*15. శ్రీరాముడు:* ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.

*16. సీతాదేవి:* తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమే.

*17. చంద్రుడు:* శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.

*18. యముడు:* కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.

*19. బ్రహ్మ:* సకల సృష్టికి అధిష్ఠాత.

*20. వరుణుడు:* భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.

*21. నారాయణుడు:* ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.

*22. హయ గ్రీవుడు:* సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.

*23. హంస:* వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.

*24. తులసీ మాత:* సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.

*🌻. శ్రీ గాయత్రీ అష్టకం 🌻*

ఉషఃకాలగమ్యా ముదాత్త స్వరూపాం

అకార ప్రవిష్టాముదారాంగ భూషామ్‌

అజేశాదివంద్యా మజార్చాంగ భాజాం

అనౌపమ్య రూపాం భజామ్యాది సంధ్యామ్‌ !!

సదాహంసయానాం స్పురద్రత్న వస్త్రాం

వరా భీతి హస్తాం ఖగామ్నాయ రూపామ్‌

స్ఫురత్స్వాధికామక్షమాలాంచ కుంభం

దధా నామహం భావయే పూర్వసంధ్యామ్‌ !!

స్ఫురచచంద్ర కాంతాం శరచ్చంద్ర వక్త్రాం

మహా చంద్రకాంతాద్రి పీనస్తనాఢ్యామ్‌

త్రిశూలాక్షహస్తాం త్రినేత్రస్యపత్నీం

వృషారూఢ పాదాం భజే మధ్య సంధ్యామ్‌ !!

సదాసామగాన ప్రియాం శ్యామలాంగీం

అకారాంతరస్థాం కరోల్లాసి చక్రామ్‌

గణాపద్మహస్తాం స్వనత్పాంచజన్యాం

ఖగేశోపవిష్టాం భజేమాస్త సంధ్యామ్‌ !!

ప్రగల్భ స్వరూపాం స్ఫురత్కంకణాఢ్యాం

సదాలంబ మానస్తన ప్రాంతహారామ్‌

మహా నీలరత్న ప్రభాకుండలాఢ్యాం

స్ఫురత్స్మేర వక్తాం భజేతుర్య సంధ్యామ్‌!!

హృదంభోజమధ్యే పరామ్నాయనీడే

సుఖాసీన సద్రాజ హంసాం మనోజ్ఞామ్‌

సదాహేమభాసాం త్రయీవిద్య మధ్యాం

భజామస్తువామో వదామ స్మరామః !!

సదాతత్పదైస్తూయమానాం సవిత్రీం

వరేణ్యాం మహా భర్గరూపాం త్రినేత్రామ్‌

సదా దేవదేవాది దేవస్యపత్నీం

మహంధీ మహీత్యాది పాదైకజుష్టామ్‌ !!

అనాథం దరిద్రం దురాచారయుక్తం

శతం స్థూలబుద్ధిం పరం ధర్మహీనం

త్రిసంధ్యాం జపధ్యాన హీనం మహేశి

ప్రసన్నంచ మాంపాలయత్వం కృపార్హం!!

ఇతీదం భుజంగం పఠేద్యస్తు భక్త్యా

సమాదాయ చిత్తే సదా తాం పరాంచాం

త్రిసంధ్య స్వరూపాం త్రిలోకైకవంద్యాం

సముక్తోభవేత్సర్వ పాపైరజస్రమ్‌ !!

*గాయత్రీస్తోత్రం*

నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేఽక్షరీ |
అజరేఽమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ || 1 ||

నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేఽమలే |
బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోఽస్తు తే || 2 ||

అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ |
నిత్యానందే మహామాయే పరేశానీ నమోఽస్తు తే || ౩ ||

త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా |
మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః || 4 ||

పూషాఽర్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః |
పితరో నాగయక్షాంశ్చ గంధర్వాఽప్సరసాం గణాః || 5 ||

రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ |
ఋగ్యజుస్సామవిద్యాశ్చ హ్యథర్వాంగిరసాని చ || 6 ||

త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః |
పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ || 7 ||

త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ |
బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ 
|| 8 ||

తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా |
పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే
 || 9 ||

చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే |
స్వాహాకారేఽగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ || 10||

నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్ |
సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ || 11||

అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ |
మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే || 12 ||

*🌻. గాయత్రీ మంత్రం - పరమేశ్వరుడు 🌻*

గాయత్రీ మంత్రం సృష్టిస్థితి లయ కారకుడైన పరమేశ్వరునిది - శుద్ధ బ్రహ్మ స్వరూపుడైన పరమాత్మది. నిజానికి సృష్టికి అతీతంగా చెప్పినప్పుడు ’పరమాత్మ’ అని వ్యవహారం. అతడే సృష్టి స్థితి లయలు చేస్తున్నప్పుడు ’పరమేశ్వరుడు’ అని వ్యవహరింపబడతాడు.
రెండూ ఒకటే తత్త్వం. అయితే ఆ పరమాత్మను శివునిగా భావించి ఆరాధించే వారికి గాయత్రి శివస్వరూపమే. దానికి ప్రమాణంగా కొన్ని వాక్యాలున్నాయి. అలాగే విష్ణువుగా భావించే వారికి గాయత్రీ మంత్రానికి విష్ణువే లక్ష్యం. దానికీ ప్రమాణ వాక్యాలు ఉన్నాయి. అదేవిధంగా గణపతి పరంగా, సూర్య పరంగా, శక్తి పరంగా, స్కందుని పరంగా కూడా అన్వయించే శాస్త్ర వాక్యాలున్నాయి. వీటినిబట్టి ఎవరి ఉపాస్య దైవాన్ని వారు గాయత్రీ మంత్ర స్వరూపంగా ధ్యానించి ఆరాధించి తరించవచ్చు అని భావం.
"మాబుద్ధులను ప్రేరేపించే సృష్టికారకమైన శ్రేష్ఠమైన పరబ్రహ్మ తేజస్సును ధ్యానిస్తున్నాము" అని మంత్రభావం. సూర్య మండలంలోని పరంజ్యోతిని వారి వారి ఇష్ట దేవతారూపంగా భావించడం పరమార్థం. ఈ దేవతలు కూడా వేదం ప్రతిపాదించిన శివ విష్ణు శక్తి గణేశ సూర్య స్కంద రూపాలు కావాలి. ఎందుకంటే - మంత్రం కూడా వేద సంబంధి కనుక.
మరొక విశేషం - పై దేవతల మంత్రాలను సంధ్యాకాలంలో ఉపాసిస్తే అది వారికి గాయత్రి అవుతుంది. అయితే - అందరూ పఠించదగిన గాయత్రీ మంత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రాధానమైనవి మూడు. సంధ్యాకాలాలలో వీటిని జపిస్తే ’గాయత్రి’ అవుతాయి.

* సర్వ చైతన్య రూపాం తాం, ఆద్యాం విద్యాం చ ధీమహి, బుద్ధిం యా నః ప్రచోదయాత్!!

*పరమేశ్వర విద్మహే, పరతత్త్వాయ ధీమహి, తన్నో బ్రహ్మ ప్రచోదయాత్!!

*యోదేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః!
ప్రేరయేత్తస్య తద్భర్గః తద్వరేణ్య ముపాస్మహే!!

🌻. సద్బుద్ధి ప్రదాయిని.. గాయత్రి 🌻

ఏ పనిచేస్తున్నా- ‘ఇది నేను చేయటం లేదు, నాలోని జగన్మాత చేయిస్తున్నది’ అనే సంపూర్ణ శరణాగతి, నివేదన భావంతో మంచిపని చేస్తే అది జగజ్జనని ఆరాధన అవుతుంది. జీవితమంతా ఒక మహాసాధన. ఇందులో ఏ క్షణం కూడా మనది కాదు. దానిని వ్యర్థం చేసేందుకు మనకు అధికారం లేదు. అద్భుతమైన ఈ శరీర యంత్రాన్ని మనకు ప్రసాదించిన శ్రీమాతను స్మరిస్తూ, ఈ శరీరం మనకూడా ఉండగానే, ఇందులో అంతర్లీనంగా ఉన్న ఆనంద బిందువును ఆర్ద్రతతో, అప్రమత్తంగా, ఆప్యాయంగా అందుకోవాలి. అందుకు ఆధారం-త్రికాల సంధ్యా దేవత గాయత్రీమాత అనుగ్రహం.
గాయత్త్రీ వ్యాహృతి సంధ్యా అని గాయత్రీ మాతను కీర్తించాడు హయగ్రీవ మహర్షి. దీనినిబట్టి మనకర్థమయ్యేదేమిటంటే- సంధ్య ఎవరో గాదు- గాయత్త్రే. ఆ గాయత్రి కూడా ఎవరో కాదు- శ్రీలలితా పరదేవతే, మహాశక్తే. ఆ శక్తి కాలస్వరూపిణి. కాలమంటే కదిలేది. అచలమైన తత్త్వం నుండి చలించి వస్తుంది ఆ శక్తి. చలించి, పరా పశ్యంతి, మధ్యమా, వైఖరీ అని నాలుగు దశలలో కిందికి చలించి దిగి వచ్చింది. వచ్చి, అదే మనకు చివరకు వైఖరీ రూపమైన ఈ ప్రపంచంగా కనిపిస్తుంది. ఈ చరాచర ప్రపంచమే- నిరంతర భ్రమణశీలమైన ఆ గాయత్రీ శక్తి.

మన నాత్త్రాయతే ఇతి మన్త్రః మననం చేసే కొద్దీ మనలను కాపాడేదేదో అదీ మంత్రమంటే. మంత్రాణా మర్థస్తిరోహితో భవతి అని పెద్దలు చెప్తారు. మంత్రం పైకి కనిపిస్తున్నా మంత్రార్థమలా కనిపించదు. అందులో రహస్యంగా ఉంటుంది. మననం వల్లనే అది ప్రకటితమవుతుంది. ఆదిభౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికమని మూడు భూమికలలో భావన చేయాలి. ఆది దైవికమైన స్థాయి నుంచే దిగి వచ్చిందది మనదాకా. దిగి వచ్చేటప్పుడది గాయత్త్రి.
గాయతి త్రాయతే ఇతి గాయత్త్రీ. ఎవరా మంత్రాన్ని గానం చేస్తుంటే వారిని కాపాడుతుంది కనుక గాయత్త్రి అయింది.
న గాయత్య్రాః పరం మంత్రం నమాతుః పరదైవతమ్ గాయత్రికి మించిన మంత్రము లేదు. తల్లిని మించిన దేవత లేదని దివ్య సూక్తి. ఏ మంత్రానుష్ఠానం చేసినా, ముందు గాయత్త్రీ మంత్రం చేస్తేనేగాని దాని ఫలితం మనకు రాదు. అదీ గాయత్త్రీ మంత్ర జప విశిష్టత. గాయత్రీ ఛందసామహమ్ అని ఋక్కులలో గాయత్రి మంత్రమును తానేనని భగవద్గీత పదవ అధ్యాయంలో గీతాచార్యుడు నొక్కి వక్కాణించటం- గాయత్రీ మంత్ర మహోదాత్తత విశదమవుతుంది. సద్బుద్ధి ప్రదాయిని గాయత్రి. దీర్ఘాయువు, సత్సంతానం, గోవులు, కీర్తి, ద్రవ్యము, బ్రహ్మ వర్చస్సులను ప్రసాదించి, అంత్యంలో బ్రహ్మమును అనుగ్రహించు కరుణామయి ‘గాయత్రి’ అని చెపుతోంది అధర్వణ వేదం.

గాయత్రీ మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు వస్తాయి. వాటిని మూడు భాగాలుగా చేస్తే, ఒక్కొక్క భాగానికి ఎనిమిది అక్షరాలు వస్తాయి. ఈ మూడు ఖండాలు- సృష్టి స్థితి లయాలకు సూచితం. మొదటి ఖండం- ఋగ్వేదం; రెండవది-సామవేదం; మూడవది- యజుర్వేదం అవుతాయి. కనుక గాయత్రి వేదమాత.

గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలకు, వాల్మీకి మహర్షి ఒక్కొక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలతో, వెరసి ఇరవది నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణ మహాకావ్యాన్ని రచించారు. కనుకనే, గాయత్రీ మంత్రాక్షర ఘటితమైన శ్రీమద్రామాయణము సర్వశక్తి సమన్వితమయింది. కాలచక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు సూర్యుడు. చండ మార్తాండ మండల మధ్యలో సూర్యునికి అధిష్ఠాత్రి అయి అతనికి కూడా సత్తా స్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్య రూపిణి గాయత్రి.

ప్రాణశక్తి గాయత్రి..

సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి నెల రోజులు పడుతుంది. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకతలుంటాయి. ప్రకృతిలో అనేక మార్పులొస్తాయి. అవి మానవ శరీరంపై, మనసుపై ప్రభావం చూపుతాయి. పుట్టినప్పుడు ఏ రాశిలో సూర్యుడున్నాడో అది ముఖ్యమైన ప్రాణశక్తి. ప్రాణం మన శరీరంలో నాభి దగ్గర ఉంటుంది. అందుకే సృష్టించే బ్రహ్మదేవుడు- స్థితి కారకుడైన విష్ణుమూర్తి నాభి కమలం లోంచి జన్మించాడు. గర్భస్థ శిశువు నాభి, తల్లి నాభి కలుస్తాయి. ఇదే గర్భస్థ శిశువులకు ప్రాణశక్తిని ఇచ్చేది. బయటకు వచ్చిన తర్వాత శిశువును వేరు చేస్తారు. అలా వేరవగానే సూర్యశక్తి- ప్రాణశక్తిగా పుట్టిన శిశువుకు సమకూరుతుంది. ఈ శక్తియే గాయత్రీ మాత. పిల్లలు ఎదిగినకొద్దీ వారికి ప్రాణశక్తిని ఎలా పొందాలనే విషయమై ప్రాణామాయ కుండలినీ శక్తి గురించి నేర్పాలి. రోజూ మూడుసార్లు త్రిసంధ్యలలో ప్రాణాయామం చేస్తే బుద్ధి వికసిస్తుంది, పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ సంధ్యా దేవతే గాయత్రీమాత.

గాయత్రీ జప సుప్రీతాయై నమః- సూర్య సహస్ర నామావళి

మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. అందరికీ ఆరోగ్యాన్ని, జీవించటానికి ఆహారాన్ని ఇచ్చేవాడు. కనుకనే ఆదిత్యుణ్ణి- అన్నదాత, ఆరోగ్య ప్రదాత అన్నారు. తల్లి తన పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. సూర్యభగవాడు సమస్త జీవరాశులకు, వృక్ష లతాదులకు, ప్రకృతిలోని అన్నింటికీ పోషకుడు. పంచభూతములకు (భూమి, నీరు, అగ్ని, వాయువు,ఆకాశము) సూర్యుడు స్ఫూర్తిదాయకుడు, శక్తినిచ్చేవాడు. అందుకే సూర్యుణ్ణి ‘పూషణ్’ అన్నారు.
కాలభేదములు ఏర్పడటానికి సూర్యుడే కారకుడు. ఒక్క సెకన్ కూడా తేడా లేకుండా ఆయా ప్రదేశాలలో, ఆయా ఋతువులను అనుసరించి ఆయా తేదీలలో సూర్యోదయ, సూర్యాస్తమానాలు జరుగుతాయి. ఎన్ని సంవత్సరాలకైనా అదే సమయంలో జరుగుతుంది. కనుక కాల నియమం, సమయ పాలన, కాలప్రాముఖ్యతకు, సూర్యుడే ఆదర్శంగా నిలుస్తాడు. ఇది లేకపోతే జ్యోతిశ్శాస్తమ్రే లేదు. నిత్యానుష్ఠాన కర్మలే లేవు. సూర్యుడు రాకపోతే రోజు గడవదు. అతడు త్యాగమూర్తి, నిత్య కర్తవ్య పరిపాలకుడు. అందుకే మహర్షులు ‘‘మీరు కూడా సూర్యుని వలె ఉండండని, ఆత్మ తేజస్సుని వికసింపచేసుకోండి’’ అని చెప్పారు.

సూర్యుణ్ణి మనం దైవంగా భావించి, పరబ్రహ్మ స్వరూపంగా ఉఫాసిస్తాం, ఆరాధిస్తాం. సూర్యునిలోని సద్గుణ శక్తియే- గాయత్రి. సూర్యునికి, గాయత్రికి భేదం లేదు. మంత్రం సూర్య తేజస్సు పరంగా ఉంటుంది. సాకార రూపం- గాయత్రీమాత.

గాయత్రీ మంత్రం.. ఆధ్యాత్మికత

శ్రీ దేవీ నవరాత్రులలో శ్రీ దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు. ఇది గాయత్రీ మంత్ర స్వరూప తత్త్వమే. గాయత్రీ మంత్రంలోని మూడు పాదములు శ్రీ దుర్గా సప్తశతిలోని మూడు చరిత్రలకు స్ఫూర్తి. గాయత్రీ మంత్రంలోని మొదటి చరమణమైన *ఓం *భూర్భవో స్వాహాః తత్స వితుర్వరేణ్యం* దుర్గా సప్తశతిలోని ప్రథమ భాగం. దానికి అధిష్ఠాన దేవత మహాకాళి. 
*కాళి-కాల స్వరూపం.* సమస్తమూ కాలం లోంచి ప్రభవించి ప్రళయకాలంలో లయమవుతాయి. కనుక, ప్రథమ పాదాన్ని సంపూర్ణంగా తెలిసికొంటే ఆధ్యాత్మిక సూర్యోదయం కలిగి, ప్రతి ప్రభాతం ఒక సుప్రభాతం అవుతుంది.

గాయత్రీ మంత్రంలోని రెండవ పాదం-

 *‘భర్గోదేవస్య ధీమహి’* 

అన్నదానికి శ్రీ దుర్గా సప్తశతిలో రెండవ చరిత్రలో ఉన్నది. దీనికి అధిష్ఠాత్రి శ్రీ మహాలక్ష్మి- స్థితికర్తయైన విష్ణుపత్ని. సాధకుడికి పోషణ సామర్థ్యం కలిగి, విజ్ఞానం, ఐశ్వర్యం, సత్వగుణం ప్రాప్తిస్తాయి. అనుదినం సుదినం అవుతుంది.

గాయత్రీ మంత్ర మూడవ చరణం-

 *ధియోయోనః ప్రచోదయాత్-*

 దీని వివరణ శ్రీదేవీ సప్తశతిలో మూడవ చరిత్రలో విశదీకరింపబడింది. దీనికి మహాసరస్వతి అధిష్ఠానదేవత. ‘నేనెవరు?’ అనేదానికి సంపూర్ణమైన అర్థాన్ని తెలుసుకోగలుగుతారు. ఇక సూర్యోదయం ఉండదు. ఎందుకంటే హృదయంలో సూర్యాస్తమయం ఉండదు గనుక. ఇది గాయత్రీ మంత్ర విశేషం.

నాభి హృత్కంఠ రసన నాసాదులయందు, ధర ఋక్యామాదులలో వర గాయత్రీ హృదయమున- అన్న త్యాగరాజ కీర్తనను మననం చేసుకొంటూ, సప్తస్వర సుందరులను భజించి, సంగీత సాధనలో గాయత్రీ మాతను ఆరాధిస్తారు నాదయోగి శిష్యపరంపర. సంధ్యాదేవీం, సావిత్రీం, వర గాయత్రీం, సరస్వతీ భజేహం అన్న దేవక్రియ రాగంలో ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన గాయత్రీ తత్త్వానికి దర్పణం. దేవీ అనుగ్రహంతో సంప్రాప్తించిన శక్తిని లోక కల్యాణానికి ఉపకరించి తరించాలని ఉద్బోధిస్తోంది- సద్బుద్ధి ప్రదాయిని, సంధ్యాదేవత వేదమాత గాయత్రి.
🌹 🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.